నిర్మల్ చైన్గేట్, జూన్ 27 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగానే కోట్లాది రూపాయలు వెచ్చించి దవాఖానల ఏర్పాటు, సిబ్బంది నియామకం చేపడుతున్నది. ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పట్టణాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయగా, సత్ఫలితాలు సాధిస్తున్నాయి. నిర్మల్ పట్టణంలో గత ఏడాది జూన్ 17న బస్తీ దవాఖానను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దవాఖానను ప్రారంభించారు. వైద్యుడు, సిబ్బందిని నియమించారు. దవాఖానను ఏర్పాటు చేసినప్పటి నుంచి కాలనీ వాసులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏదైనా జ్వరం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు పెద్ద దవాఖానకు వెళ్లాలంటే ప్రజలు అనేక వ్యయ ప్రయాసలకు గురయ్యేవారు. ప్రైవేట్ దవాఖాన, ఆర్ఎంపీల వద్దకు వెళ్తే అనేక సమస్యలు ఎదురయ్యేవి. కాలనీలోనే దవాఖాన ఏర్పాటు చేయడంతో ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారు.
ఉదయం 9 నుంచి 4 గంటల వరకు సేవలు
బస్తీ దవాఖానలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోగులకు పరీక్షలు చేస్తున్నారు. దవాఖానలో వైద్యాధికారి, స్టాఫ్నర్సు, ఆఫీస్ సబార్డినేట్ ఉంటారు. బస్తీ దవాఖానలో ప్రాథమిక వైద్య సేవలు అందుతున్నాయి. ఇక్కడికి వచ్చిన రోగులకు ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు రక్తనమూనాలు సేకరించి పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రానికి పంపిస్తుంటారు. ఇప్పటివరకు 16,250 మంది పరీక్షలు చేసుకున్నారు. బీపీ, షుగర్, తదితర వ్యాధులకు సైతం పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. చిన్నపిల్లలకు ప్రతి బుధవారం వ్యాధినిరోధక టీకాలు ఇస్తున్నారు. టీబీ ఇతర వ్యాధులతో బాధపడేవారికి అవసరమైన మందులు అందజేస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు దగ్గరలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి, జిల్లా దవాఖాన, ఇతర పెద్దాసుపత్రికి రెఫర్ చేస్తుంటారు. అందుబాటులో వైద్య సేవలు అందుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వినియోగించుకుంటున్నారు..
ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. నిత్యం జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో దవాఖానకు వస్తున్నారు. చుట్టు పక్కల వార్డులనుంచి సైతం రావడంతో వారిని పరీక్షించి పరిస్థితిని బట్టి అన్ని రకాల పరీక్షలు చేస్తున్నాం. అవసరమైన వారి రక్తనమూనాలు తీసుకొని టీహబ్కు పంపిస్తున్నాం. ఫలితాలు చూసి వెంటనే మందులు ఇస్తున్నాం. వ్యాధి తీవ్రత ఉన్నవారిని పెద్దాసుపత్రికి రెఫర్ చేస్తున్నాం. ప్రతి బుధవారం చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నాం. అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– షగుప్త అంజుమ్, వైద్యురాలు, బస్తీదవాఖాన, నిర్మల్
వైద్యులు బాగా చూస్తున్నారు..
బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడంతో కాలనీవాసులకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయి. జ్వరాలు, చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడల్లా పెద్ద దవాఖానకు వెళ్తే ఆటో కిరాయిలు, దూర ప్రయాణం చేయాల్సి వచ్చేది. ప్రైవేట్ దవాఖానకు వెళ్తే అనేక ఖర్చులయ్యేవి. బస్తీ దవాఖానతో అనేక ఇబ్బందులు తీరాయి. వైద్యులు అన్ని పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. నాకు ఒళ్లు నొప్పులుంటే దవాఖానకు వచ్చా. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి మందులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి కృషి చేస్తున్నది.
– సిరికొండ అనసూయ, కాలనీవాసురాలు, నిర్మల్