బేల, జనవరి13 : ఏటా పుష్యమాసంలో బేల మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో జంగి జాతర వారం పాటు నిర్వహిస్తారు. ఈ నెల 15న ఈ జాతర ప్రారం భం కానుంది. ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ 15 నుంచి 21 వరకు జాతర కొనసాగనుంది. నవమి రోజున ఆలయాల్లో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి జారతను ప్రారంభిస్తారు. అమావాస్య రోజు కాల దహి అండతో ముగిస్తారు. 19 న ఆదివాసీలు బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఆలయాల ప్రత్యేకత…
ఆదివాసీల ఆరాధ్య దైవమైన బైరాందేవ్, మహాదేవ్ ఆలయాలు శాతవాహనుల కాలంలో నల్లరాతితో నిర్మించారు. అందమైన శిల్పాలు ఉన్నాయి. మనసులో ఏదైనా కోరుకొని బైరాందేవ్ ఆలయంలోని లింగాన్ని ఎత్తితే జరిగే పని అయితే లింగం తేలికగా లేస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయాలకు మండలం నుంచే కాకుం డా ఆదిలాబాద్ ,జైనథ్, ఇంద్రవెల్లి, నార్నూర్, ఉట్నూర్తో పాటు మహారాష్ట్ర ప్రజలు సైతం ఈ ఆలయాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అటవీ సమీపాన ఉండి సాగుతుండడంతో దీన్నే జంగి జాతర అని కూడా పిలుస్తారు.
రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు
ఆలయాల పరిసరాల్లో రూ. 35 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆరు నెలల క్రితం రూ. కోటి వ్యయంతో సదల్పూర్ శివారు ( సోన్ఖాస్ గ్రామ బీటీ రోడ్డు క్రాస్ ) నుంచి బైరాందేవ్, మహాదేవ్ ఆలయాల వరకు కిలోమీటర్ మేర బీటీ రోడ్డు మరమ్మతుతో పాటు మార్గమధ్యంలో లోలెవల్ బ్రిడ్జి ఉన్న చోట హైలెవల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. రూ. 25 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మించారు. రూ. 15 లక్షలతో చేపట్టిన విశ్రాంతి గది నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. రూ. 25 లక్షలతో చేపట్టిన మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయ్యింది.