నెన్నెల, అక్టోబర్ 26 : కష్టపెట్టే కాంగ్రెస్ పార్టీ కావాలో.. రైతుల మేలు కోరే బీఆర్ఎస్ కావాలో.. ప్రజలే నిర్ణయించుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచించారు. గురువారం నెన్నెల మండలంలోని మైలారం, గొల్లపల్లి, జోగాపూర్, ఘన్పూర్ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఆయాచోట్ల ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుంటే, ఆ పథకాన్ని ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.
రబీ సీజన్కు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభు త్వం ఏర్పాట్లు చేస్తుంటే కాంగ్రెస్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం సిగ్గు చేటన్నారు. రైతుల జీవితాలతో ఆడుకునే కాంగ్రెస్ ఒకవేళ అధికారంలోకి వస్తే రైతుబంధు, రైతుబీమా, ధరణిని రద్దు చేస్తారన్నారు. ఇప్పుడు రైతులకు 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం 3 గంటల కరెంట్ చాలని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు మంత్రిగా పని చేసి అభివృద్ధి చేయకుండా ప్రజల సొమ్మను దోచుకున్న వ్యక్తి.. ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నాడని ఆరోపించారు.
రైతుబిడ్డనైన తనపై వందల కోట్లున్న వ్యాపారీ పోటీ చేస్తున్నాడని.. ఇది ప్రజలు గమనించాలని కోరారు. బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకే మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ శ్యామల, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సాగర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మేకల మల్లేశ్, ఆత్మ చైర్మన్ సున్నం రాజు, కోఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, సర్పంచ్లు లక్ష్మి, తిరుపతి రెడ్డి, మల్లేశ్, ఎన్క మల్ల య్య, శివప్రసాద్, శంకర్, నవీన్గౌడ్, నాయకులు భీమాగౌడ్, రాంచందర్, ప్రతాప్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, పాపయ్య, నారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.