బెల్లంపల్లి, మార్చి 13 : మళ్లీ పాత కథే మొదలైంది. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలు పదేళ్ల తర్వాత మరోసారి అదే బాటలో నడుస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్త రూపు దిద్దుకున్న ఈ విజ్ఞాన భాండాగారాలు, తిరిగి యథాస్థితికి చేరుకుంటున్నాయి. బెల్లంపల్లి శాఖ గ్రంథాలయంలో రెండు నెలలుగా పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గతంలో పోటీ పరీక్షల సమయం లో 12 గంటలు ఉన్న గ్రంథాలయ సమయాన్ని, ప్రస్తుతం పది గంటలకు కుదించారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం, రెండో శనివారాల్లో గ్రంథాలయాన్ని మూసి ఉంచుతుండడంతో, రీడర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బెల్లంపల్లి శాఖ గ్రంథాలయం మొదట సీఐ కార్యాలయం ఆవరణలో ఒకటి, రెండు గదుల్లో కొనసాగేది. కొందరు దినపత్రికలు చదవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చేవారు. పట్టణానికి చెందిన చాలా బస్తీలకు దూరంగా ఉండడంతో ఇక్కడి రావడానికి విముఖత చూపేవారు. ఆ తర్వాత 2016లో గ్రంథాలయాన్ని బజార్ ఏరియాలోని పాత క్లబ్ పాఠశాలలోకి మార్చారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రేణికుంట్ల ప్రవీణ్ బాధ్యతలు తీసుకున్నాక, జిల్లా వ్యాప్తంగా బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్లోని గ్రంథాలయ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని సంబంధిత మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మిగతా గ్రంథాలయాలతో పాటు బెల్లంపల్లి గ్రంథాలయ భవన నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరయ్యాయి. మహిళలు, పురుషులకు వేర్వేరుగా రీడింగ్ రూములు ఏర్పాటు చేశారు. దినపత్రికలు చదివే వారి కోసం మరో హాల్ను నిర్మించారు. రెండు హాళ్లలో ఏసీ సౌకర్యం, పాఠకులకు సౌకర్యంగా ఉండే కుర్చీలను ఏర్పాటు చేశారు.
ఇటీవల ప్రభుత్వం పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గ్రంథాలయానికి అభ్యర్థులు వస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పని వేళలు ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు స్వీపర్ గ్రంథాలయం తెరిచినా, లైబ్రరీయన్ వచ్చాక 11 గంటల నుంచి పుస్తకాలు ఇస్తున్నారని అభ్యర్ధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో ప్రతి శుక్రవారం, రెండో శనివారం కూడా గ్రంథాలయాన్ని తీసి ఉంచేవారు. అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరంతో పాటు ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. డిప్యూటేషన్పై ఉన్న లైబ్రేరియన్ ప్రతి బుధవారం కాసిపేట లైబ్రరీకి వెళ్తుండడంతో అభ్యర్ధులు ఇబ్బందులు పడుతున్నారు. లైబ్రేరియన్ సెలవుపై వెళ్లినా, తమకు పుస్తకాలు అందుబాటులో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అదనపు కలెక్టర్ రాహుల్ గ్రంథాలయాన్ని సందర్శించినప్పుడు అభ్యర్ధులు ఇక్కడి సమస్యలను ఆయన దృష్టికి కూడాతీసుకువచ్చారు. ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్కు కూడా వినతిపత్రం సమర్పించారు. అయినా కూడా పరిష్కారం కాకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బెల్లంపల్లి గ్రంథాలయం రోజూ ఎని మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచాలి. ప్రస్తు తం నిరంతరం చదవాల్సి ఉంటుంది. గ్రంథాలయం సాయంత్రం ఆరు గంటల వరకే ఉంచుతున్నారు. సబ్జెక్ట్పై పట్టు సాధించాలంటే, గ్రంథాలయంలో చదవాలి. ఉదయం 8 గంటలకు గ్రంథాలయాన్ని తెరిచినా, పుస్తకాలు ఇవ్వడం లేదు. గ్రంథాలయాన్ని 12 గంటల పాటు తీసి ఉంచాలి.
గతంలో లాగే పోటీపరీక్షల నోటిఫికేషన్లు విడుదలైనప్పుడు ఉచిత కోచింగ్ ఇచ్చేవారు. మూడు నెలలు నిష్ణాతులైన ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహించారు. ప్రస్తుతం కూడా అదేవిధంగా కోచింగ్ ఇవ్వాలి. అంతేకాకుండా సుదూరప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బందులు పడకూడదని ఉచిత భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా భోజన సౌకర్యం కల్పించాలి. అప్డేట్ స్టడీ మెటీరీయల్ను అందించాలి. 12 గంటల పాటు గ్రంథాలయం తెరిచి ఉంచాలి.
ప్రతి శుక్రవారం, రెండో శనివారం గ్రంథాలయాన్ని మూసి ఉంచుతున్నారు. ఈ విలువైన నాలుగు నెలల పాటు పండుగ సెలవులు కాకుండా ఇతర సెలవులు లేకుండా గ్రంథాలయాన్ని తెరిచి ఉంచాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వచ్చి ప్రిపేర్ అవుదామనుకుంటే ఈ సెలవులతో ప్రిపరేషన్పై ఉన్న శ్రద్ధ పోతున్నది. సెలవు దినాల్లో ఇంట్లో చదువుకుందామంటే ఇంతటి ప్రశాంత వాతావరణం అక్కడ ఉండదు. గ్రంథాలయంలో ఉన్న సమస్యలపై ఇప్పటికే జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి కూడా తీసుకెళ్లాం.