తాండూర్, నవంబర్ 3 : సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల సమస్యలను తీర్చి, రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎన్నికల ఇన్చార్జి, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని స్పష్టం చేశారు. తాండూర్లోని మినీ సురభి గార్డెన్స్లో శుక్రవారం వెంకటేశ్ నేతకాని అధ్యక్షత బీఆర్ఎస్ మండల బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ నమ్మకంతో బెల్లంపల్లి టికెట్ ఇచ్చారని, అందరూ ఐక్యతతో పనిచేసి గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సకాలంలో అందుతున్న సంక్షేమ పథకాలు, తిరిగి అధికారంలోకి వస్తే ప్రజల కోసం ఏం చేస్తుందనేది విస్త్రత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు సూచించారు. ప్రతీ బూత్ సభ్యుడికి వంద మంది ఓటర్లు.. అంటే కేవలం 25 ఇండ్లకు పోయి ప్రచారం చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలుపించుకునేందుకు కార్యకర్తలు, బూత్ లెవల్ సభ్యులంతా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇదే కార్యక్రమంలో మండలంలోని నీలాయిపల్లి, కిష్టంపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, యువకులు సూమారు 100 మంది బీఆర్ఎస్లో చేరారు.
కాగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, బుగ్గ దేవస్థానం చైర్పర్సన్ మాసాడి శ్రీదేవి, పార్టీ అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, రైతు బంధు సమితి కన్వీనర్ దత్తాత్రేయరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గట్టు సంతోష్కుమార్, సీనియర్ నాయకులు ఎస్ మహేందర్రావు, పురుషోత్తంగౌడ్, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.