బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల (సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ) సక్సెస్కు కేరాఫ్గా నిలుస్తున్నది. ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘హయ్యర్ ఎడ్యుకేషనల్ సెల్’ నిరుపేద పిల్లల భవిష్యత్కు బంగారు బాటలు వేస్తున్నది. ఉపాధ్యాయులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో విద్యార్థిలోకం పట్టుబట్టి జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీట్లు సాధిస్తు న్నది. ఇప్పటికే అనేక మంది వివిధ కోర్సుల్లో చేరి లక్ష్యం వైపు దూసుకెళ్తుండగా, కళాశాల సిబ్బందితో పాటు తల్లిదండ్రుల్లోనూ హర్షం వ్యక్తమవుతున్నది. కాగా, పలుచోట్ల ఉన్నత విద్యకు అర్హత సాధించిన విద్యార్థులపై ప్రత్యేక కథనం మీకోసం..
బెల్లంపల్లి రూరల్, జూలై 15 : బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల (సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ) విద్యార్థులు పట్టుబట్టి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీట్లు సాధించి భేష్ అనిపించుకుంటున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల ను ఉన్నత విద్యావకాశాల వైపు మళ్లించాలన్న ఆశయంతో 2018 లో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు చైర్మన్గా హయ్యర్ ఎడ్యుకేషనల్ సెల్ను ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో ఉండే కోర్సులు, సంబంధిత కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు అందివచ్చే అవకాశాలను పూర్తిగా వివరించడం, పలు యూనివర్సిటీల పరీక్షల విధానంపై తర్ఫీదునివ్వడం, యూనివర్సిటీల అధికారులతో సెమినార్లు నిర్వహించి విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలపై అవగాహన కల్పించడంలో హయ్యర్ ఎడ్యుకేషనల్ సెల్ తనదైన పాత్ర పోషించింది.
యూనివర్సిటీలు వెలువరించే నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియపరిచి.. వారిని ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేలా ప్రోత్సహించింది. విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణతో కూడిన ప్రణాళిక అమలు చేస్తూ మాక్ (మౌఖిక) ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఐఐటీ, నీట్లతో పాటు ఇండియన్ హోటల్ మేనేజ్మెంట్ (ఐహెచ్ఎం), సైన్స్ సంబంధిత యూనివర్సిటీల్లో అందే కోర్సులు, ఉద్యోగావకాశాలకు సంబంధించిన అంశా ల్లో విద్యార్థులకు అవగాహన పెంచేందుకు ఎంతగానో తోడ్పాటునందించింది. ఫలితంగా బెల్లంపల్లి సీవోఈ నుంచి ఎంతో మంది విద్యార్థులు నేడు ఉన్నత లక్ష్యాలతో తమ చదువు కొనసాగిస్తున్నా రు. జాతీయస్థాయిలో పేరెన్నిక గల యూనివర్సిటీల్లో సీవోఈ విద్యార్థులు సీట్లు సాధించి ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకున్నారు.
అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో సీటు సాధించా
మాది ఖమాన గ్రామం. బెల్లంపల్లి సీవోఈలో ఇంటర్ పూర్తి చేశాను. ఇక్కడి విద్యా బోధన, నిత్య ప్రణాళికలు నన్ను పూర్తిగా మార్చేశా యి. లక్ష్యాన్ని సాధించగలననే నమ్మకాన్ని కలిగించా యి. కష్టపడి చదివి ఎంపీసీలో మంచి మార్కులు తెచ్చుకున్నా. దేశంలోనే గొప్పదైన అజీమ్ ప్రేమ్జీ యూనివర్సి టీలో సీటు సాధించా. ప్రస్తుతం బీఎస్సీ బీఈడీ (కెమిస్త్రీ) చదవడానికి అర్హత సాధించా. ఇది పూర్తి కాగానే ఐపీఎస్కు ప్రిపేర్ అవుతా.
– చునార్కర్ అఖిలేశ్వర్, బెల్లంపల్లి సీవోఈ విద్యార్థి, వాంకిడి మండలం
రిమ్స్లో ఎంబీబీఎస్ చేస్తున్న
మాది పేద కుటుంబం. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. నేనే పెద్దోడిని. అమ్మానాన్నల ప్రోత్సాహంతో బెల్లంపల్లి సీవోఈలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. కళాశాలలో పదో తరగతి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ అందిస్తున్న ప్రతీ విషయాన్ని అర్థం చేసుకున్నాను. బాగా చదవాలని ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెప్పేవారు. వారి నుంచి సలహాలు తీసుకుని విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను. ప్రతీ సబ్జెక్టును ఇష్టంగా చదవడంతో పాటు సైన్స్కు సంబంధించిన అంశాలను సులువుగా అర్థం చేసుకున్నాను. నాకు వెన్నంటి నిలుస్తున్న బెల్లంపల్లి సీవోఈ అధ్యాపకులను ఎప్పుడూ మరిచిపోలేను. కళాశాలలో అందించిన ప్రిపరేషన్ వల్లే మెడిసిన్లో మంచి ర్యాంక్ సాధించగలిగాను. ప్రస్తుతం నేను ఆదిలాబాద్లోని రిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న.
– సోన్కాంబ్లే అనిరుధ్, బెల్లంపల్లి సీవోఈ విద్యార్థి, ఆదిలాబాద్
కంపెనీ పెట్టి ఆర్కిటెక్చర్లకు ఉద్యోగాలిస్తా
ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు బెల్లంపల్లి సీవోఈ లో చదివాను. గొప్ప ఆర్కిటెక్చర్ కావాలన్నది నా లక్ష్యం. అమ్మా నాన్నలు వ్యవసాయ కూలీలు. మా కుటుంబంలో ఉన్నత చదువులపై ఏమాత్రం అవగాహన లేదు. చదువు లో వెనుకబడినపుడు ప్రిన్సిపాల్ సైదులు సార్ నాకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రోత్సహించేవారు. ఆయన మాటలు నాపై చాలా ప్రభావం చూపాయి. ఇంటర్లో 884 మార్కులు సాధించాను. మా గ్రామంలో నేనొక్కడినే జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష రాశాను. ఎన్ఐటీ తిరుచ్చిలో ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్లో సీటు దక్కించుకున్నాను. చదువు పూర్తయ్యాక సొంతంగా కంపెనీ పెట్టి ఆర్కిటెక్చర్ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తా.
– పొట్టాల విష్ణు, బెల్లంపల్లి సీవోఈ విద్యార్థి, పుల్లగామ(కోటపల్లి)
ప్రజలకు సేవలందిస్తా
బెల్లంపల్లి సీవోఈలో 2019-20లో ఇంటర్ పూర్తి చేశాను. బీఎస్సీ ఆనర్స్ (అగ్రికల్చర్) చదవడానికి ఐకార్( ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్)లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్ష రాశాను. మంచి ర్యాంకు సాధించాను. ఇప్పుడు నాకు పూణేలోని మహాత్మాఫూలే విద్యాపీఠం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సీటు వచ్చింది. బెల్లంపల్లి సీవోఈలో నాకు అందిన నాణ్యమైన బోధన వల్లే నేను జాతీయ స్థాయిలో నిలదొక్కుకోగలిగాను. వ్యవసాయ రంగాన్ని క్షుణ్ణంగా చదివిన విద్యార్థి మాత్రమే తన జిల్లాపై పరిపూర్ణంగా ఆలోచన చేయ గలడనేది నా నమ్మకం. అందుకే నేను వ్యవసాయ రంగాన్ని అభ్యసించేందుకు సిద్ధమయ్యాను. చదువయ్యాక ఐఏఎస్ సాధించి ప్రజలకు సేవలందిస్తా.
– చాపిడి అజయ్, బోధంపల్లి(కౌటాల)
విద్యార్థుల విజయాలు ఆనందాన్నిస్తున్నాయి
జాతీయస్థాయి పరీక్షల్లో విద్యార్థులు సాధిస్తున్న అద్భుత విజయాలు చెప్పలేనంత ఆనందాన్నిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత పేద పిల్లల్లో ఏదైనా సాధించగల మన్న ఆసక్తి ఉంటుంది. సరైన అవకాశాలు, నాణ్యమైన విద్యను వారికి అందిస్తే ఊహించని విధంగా సక్సెస్ సాధిస్తారు. పట్టణ విద్యార్థులతో పోటీపడి జాతీయస్థాయి ప్రవేశాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. మా కళాశాలలో హయ్యర్ ఎడ్యుకేషనల్ సెల్ (హెచ్ఈసీ) ఏర్పాటు చేశాక విద్యార్థులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయగలిగాం. నిష్ణాతులైన మేథావులను కళాశాలకు పిలిపించి చర్చాగోష్టి నిర్వహించాం. విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపగలిగాం. ఉపాధ్యాయులు, అధ్యాపకుల అంకితభావం అద్భుతమైన విజయాలను సాధిస్తున్నాం. పేరెంట్స్ కమిటీ కళాశాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నది. సంస్థ అధికారుల సలహాలు, సూచనలు అందుకుంటూ ప్రణాళికతో సక్సెస్ దిశగా అడుగులు వేయగలుగుతున్నాం.
– ఐనాల సైదులు, సీవోఈ ప్రిన్సిపాల్, బెల్లంపల్లి
సీవోఈ ప్రోత్సాహంతో ఎంబీబీఎస్ సాధించా
నా పేరు కొండగర్ల సుమంత్, మాది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లి గ్రామం. నిరుపేద కుటుంబం. 5వ తరగతి నుంచి టెన్త్ వరకు బెల్లంపల్లి సీవోఈలోనే చదివా. హయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ అందించిన ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరిచిపోలేను. ఇంటర్మీడియట్ గౌలిదొడ్డి సీవోఈలో పూర్తి చేశా. కార్డియాలజిస్టు కావాలని లక్ష్యంగా పెట్టుకుని పట్టుబట్టి చదివాను. హయ్యర్ ఎడ్యుకేషనల్ సెల్ అందించిన మెళకువలు, సెమినార్లు ఎంతగానో తోడ్పడ్డాయి. ప్రిన్సిపాల్ సైదులు సార్, అధ్యాపకులు విద్యార్థుల ప్రగతి కోసం అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వారందించిన స్ఫూర్తిదాయకమైన విధానాలతోనే ప్రస్తుతం నేను ఎంబీబీఎస్ సాధించగలిగాను.
నా కల నెరవేరబోతుంది
నా పేరు తాళ్లపల్లి రుతీశ్. మాది మంచిర్యాల జిల్లా తాండూ ర్ మండలంలోని గంపల పల్లి. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేదే నా కల. ఐదు నుంచి పదో తరగతి వరకు బెల్లంపల్లి సీవోఈ లో చదివాను. అక్కడ నేను హయ్యర్ ఎడ్యుకేషనల్ సెల్ అందించిన సూచనలతో మెడిసిన్కు ప్రిపేర్ అయ్యాను. అధ్యాపకుల ప్రోత్సాహంతో ప్రణాళికాబద్ధంగా చదువుకున్నా. ఇంటర్మీ డియట్ గౌలిదొడ్డిలో పూర్తి చేశాను. బెల్లంపల్లి సీవోఈలో నేర్చుకున్న ప్రతీ అంశాన్ని గుర్తుకుపెట్టుకున్నా. ప్రస్తుతం మెడిసిన్లో ఎంబీబీఎస్ సీటు సాధించాను. న్యూరాలజి స్టు కావాలనేదే నా కల. అది నెరవేరబోతుంది.
పైలెట్ కావాలన్నది నా లక్ష్యం
నా పేరు పంచెర్పుల శ్రీనివాస్. మాది మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామం. అమ్మా నాన్నలు ఇద్దరూ వ్యవసాయ కూలీలే. సైన్యంలో విమానం నడపాలన్నది నా కోరిక. నా కలను సాకారం చేసే దిశగా బెల్లంపల్లి సీవోఈ ముందుకు నడిపింది. ఇంటర్మీడి యట్ ఎంపీసీలో 890 మార్కులు వచ్చాయి. పైలట్ కావాలంటే ప్రత్యేకమైన కోర్సు చేయాలి అని తెలుసుకు న్న. దేశవ్యాప్తంగా ఉన్న ఈ కోర్సును ఆఫర్ చేసే టాప్టె న్ యూనివర్సిటీలో జాయిన్ కావాలని నిర్ణయించుకు న్నా. ఇందుకోసం యూఐ (ఏఎంఈ సెట్) ప్రతీ సంవత్స రం జరగుతుందని హయ్యర్ ఎడ్యుకేషనల్ సెల్ ద్వారా తెలుసుకున్నా. జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు పోటీ తీవ్రంగా ఉంటుంది. ర్యాంకు ఆధారంగానే సీటు వస్తుంది. అందుకు అనుగుణంగా ఎయిర్క్రాఫ్ట్ మెయింట నెన్స్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023కు ప్రిపేర్ అయ్యాను. అధ్యాపకులు ఇచ్చిన ప్రత్యేక శిక్షణ నాకు బాగా తోడ్పడింది. ప్రిన్సిపాల్ సైదులు సార్ ప్రోత్సహిస్తూ మోటివేట్ చేశారు. కంప్యూటర్ ల్యాబ్లో ప్రీవియెస్ పేపర్లు ఆన్లైన్లో చూసుకుంటూ కాన్ఫిడెన్స్ పెంచుకు న్నాను. మే 8న కళాశాల కంప్యూటర్ ల్యాబ్లో ఆన్లైన్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యాను. జాతీయ స్థాయిలో 3664 ర్యాంక్ సాధించి 15 శాతం స్కాలర్షిప్నకు అర్హత సాధిం చాను. భారత సైన్యంలో యుద్ధ విమానాలు నడిపి దేశాని కి సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు పోతున్నా.