నిర్మల్ చైన్గేట్, ఆగస్టు 13 : రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ పథకంలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం బీడీ కార్మికులు ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ.. బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులకు ఆసరా పెన్షన్ పథకంలో దరఖాస్తు చేసుకొనే అవకాశం లేకపోవడం శోచనీయమన్నారు.
ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.4016 అందించాలన్నారు. బీడీ కార్మికులకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించకపోతే భవిష్యత్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ట రాజన్న, జిల్లా అధ్యక్షుడు బక్కన్న, నాయకులు రామ-లక్ష్మణ్, గంగన్న, గపూర్, లక్ష్మి పాల్గొన్నారు.