హాజీపూర్, ఫిబ్రవరి 2 : విపత్తులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని జాతీయ విపత్తుల ప్రతి స్పందన దళం (విజయవాడ) పదో బెటాలియన్కు చెందిన ఇన్స్పెక్టర్ బిటెన్ అన్నారు. శుక్రవారం మండలంలోని ముంపు గ్రామమైన వేంపల్లిని పరిశీలించారు. అనంతరం గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించి నీటి సామర్థ్యం.. తదితర వివరాలను ప్రాజెక్టు ఏఈఈ రాజ్కుమార్, సాగర్ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, రోడ్డు ప్రమాదాలు, వరదలవంటి విపత్తుల సమయంలో ఆస్తులు, ప్రాణనష్టం జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా వివరించారు. అనంతరం ప్రాజెక్టులో చేపలు పట్టే మత్స్యకారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ గోవింద రావు, ఆర్ఐలు మంగ పాల్గొన్నారు.