బాసర, జూలై 13 : బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థులు ఇండస్ట్రియల్ టూర్ వెళ్లారు. ఇందులో భాగంగా సుమారు 60 మంది విద్యార్థులు గురువారం హైదరాబాద్లోని ఇన్ఫోసిస్ క్యాంపస్, జూరస్ టెక్నాలజీస్ను సందర్శించారు. అక్కడ నిర్వహించే డ్రీమ్స్టూర్ రియాల్టీ వర్క్షాప్నకు హాజరయ్యారు. ఈ వర్క్ షాప్ స్పీకర్ మనీషసబు ఇన్ఫోసిస్ సెజ్ క్యాంపస్లో తన ప్రయాణం, నేర్చుకున్న పాఠాలు, భవిష్యత్ విజయాల సాధనలో మెళకువలు తెలిపారు. ఇన్ఫోసిస్ క్యాంపస్ సందర్శించిన విద్యార్థులు అధునాతన మౌలిక సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీలు తెలుసుకున్నారు. జూరాస్ టెక్నాలజీ సందర్శనలో ఐటీ పరిశ్రమల్లో తమ లక్ష్యాలను ఏ విధంగా చేరాలో నేర్చుకున్నారు. ఈ కంపెనీల సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, ఇతర నిపుణులతో విద్యార్థులు ఇంటరాక్టివ్ సెషన్లలో పాల్గొన్నారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, ఐటీ పరిశ్రమల్లో కెరీర్ అవకాశాలపై అవగాహన చేసుకున్నారు. హ్యాండ్ ఆన్ లెర్నింగ్ సందర్శనలో భాగంగా విద్యార్థులు వర్క్షాప్లు, అక్కడి వారు నిర్వహించే లైవ్ ప్రాజెక్టుల్లో పని చేసే అవకాశాన్ని, సాఫ్ట్వేర్ అభివృద్ధి మెళకువలు నేర్చుకున్నారు. ఈ ఇండస్ట్రీయల్ టూర్ ద్వారా విద్యార్థులు ఐటీ రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకోవడం, ప్లేస్మెంట్ ఎలా సిద్ధం చేసుకోవాలో సహాయ పడుతుందని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవికాంత్, సారిక తదితరులు పాల్గొన్నారు.