భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)కి కోటపల్లి మండలం కంచుకోట అని నిరూపించాలని.. గత ఎన్నికల్లో మూడు వేల మెజార్టీ ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో పది వేల మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లోని ఎంఆర్ఆర్ గార్డెన్లో గురువారం కోటపల్లి మండలానికి చెందిన 31 గ్రామాల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ దండే విఠల్ ముఖ్య అతిథులుగా హాజరైన సమ్మేళనంలో సుమన్ పాల్గొని మాట్లాడారు. గతంలో కల్లోలిత ప్రాంతంగా ఉన్న కోటపల్లిని తన హయాంలో ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నానని తెలిపారు. అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలపై గ్రామగ్రామానా చర్చ పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేగా తనను మరోసారి ఆశీర్వదించాలని కోరాడు. వర్షాలు లేనపుడు మిమ్మల్ని కాపాడేది కాళేశ్వరం, చెన్నూరు ఎత్తిపోతల పథకాలే అని స్పష్టం చేశారు.
మంచిర్యాల(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కోటపల్లి, ఏప్రిల్ 20 : ప్రాణహిత నది పక్క, రాజధానికి 320 కిలోమీటర్ల దూరం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు సరిహద్దున ఉన్న కోటపల్లి మండలం ఒకప్పుడు కల్లోలిత ప్రాంతమని, 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు చిన్నచూపు చూశాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. వెనుకబడిన కోటపల్లిని అభివృద్ధి చేయాలని, మండలానికి నూతన జవసత్వాలు తీసుకురావాలని సీఎం కేసీఆర్ సూచించారని, జిల్లాలోనే ఏ మండలానికి ఇవ్వనన్ని నిధులు ఇచ్చారని పేర్కొన్నారు. చెన్నూర్లోని ఎంఆర్ఆర్ గార్డెన్లో గురువారం కోటపల్లి మండలానికి చెందిన 31 గ్రామాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ దండే విఠల్ ముఖ్య అతిథులుగా హాజరైన సమ్మేళనంలో బాల్క సుమన్ మాట్లాడారు. గత ఎన్నికల్లో కోటపల్లి నుంచి బీఆర్ఎస్కు మూడు వేల మెజార్టీ ఇచ్చారని, ఈ ఎన్నికల్లో 10 వేల మెజార్టీ ఇచ్చి బీఆర్ఎస్కు కంచుకోట అని నిరూపించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త కేసీఆర్, ప్రతి ఒక్క ఆడ బిడ్డ సమ్మక్క-సారలమ్మ కావాలని పిలుపునిచ్చారు. 2014లో తెలంగాణ వచ్చాకే చెన్నూర్ నియోజకవర్గానికి నిధులు వస్తున్నాయన్నారు. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. గత పాలనలో వాగులపై బ్రిడ్జిలు, రోడ్లు కూడా లేవని, తన హయాంలోనే బ్రిడ్జిలు కట్టుకొని, రోడ్లు వేసుకున్నామన్నారు. అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై గ్రామగ్రామాన చర్చ పెట్టాలని సూచించారు. తుంతుంగ వాగుపై బ్రిడ్జి కట్టాలనే ఆలోచన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వాళ్లకు రాలేదని, తను ఎమ్మెల్యే అయ్యాకే రూ.8 కోట్లతో బ్రిడ్జి కట్టించానన్నారు.
కోటపల్లిని కోనసీమ చేస్తా.. త్వరలో పారుపల్లి మండలం..
మీకు గుర్తున్నా లేకున్నా.. శంకరాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కోటపల్లి మండలాన్ని మరో కోనసీమ చేస్తానని చెప్పా. అద్భుతమైన పురోగతితో చరిత్రలో నిలిచిపోయేలా మండలాన్ని తీర్చిదిద్దుతున్నా. కోటపల్లి మండలం విస్తీర్ణంలో చాలా పెద్దది. అందుకే పారుపల్లిని కొత్త మండలం చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫైల్ సీఎం కార్యాలయంలో ఉంది. కొద్ది రోజుల్లోనే సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో పారుపల్లి మండలం ఏర్పడబోతున్నది.
– ప్రభుత్వ విప్ బాల్క సుమన్
తనపై ఉన్న ప్రేమతోనే చెన్నూర్ లిఫ్ట్
తనపై ఉన్న ప్రేమతోనే చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్కు సీఎం కేసీఆర్ రూ.1,658 కోట్లు ఇచ్చారన్నారు. మంత్రి హరీశ్రావు సైతం ‘నువ్వు కాబట్టి సీఎం కేసీఆర్ ఈ పథకానికి నిధులిచ్చారు. కానీ.. వేరే ఎవ్వరు ఉన్నా ఇది సాధ్యం కాకుండే’ సుమన్ అని తనతో చెప్పారన్నారు. సీఎం కేసీఆర్కు నాపై, నియోజకవర్గ ప్రజలపై ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో చెన్నూర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద ప్రాణహిత నదిపై నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ నుంచి మండలం ఆల్గవ్ వద్ద నిర్మించనున్న పంప్హౌస్ ద్వారా శంకరాపూర్, ఆయపల్లి చెరువులలో నీటిని ఎత్తిపోసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా 35.55 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించి మండలంలోని 22,024 ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. ఈ లిఫ్ట్ అంచనా వ్యయం రూ.268.70 కోట్లు అవుతాయన్నారు. అలాగే సరస్వతీ బ్యారేజ్ నుంచి చెన్నూరు మండలం సోమన్పల్లిలో నిర్మించే పంప్హౌస్ ద్వారా ఆరేపల్లి, అస్నాద్, రెడ్డిపల్లి చెరువుల ను నింపుతూ 63.30 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మించి, మండలంలోని తొమ్మిది గ్రామాలకు సాగునీరు ఇస్తామన్నారు. వర్షాలు లేక కాలం కానప్పుడు మిమ్మల్ని కాపాడేది కాళేశ్వరం, చెన్నూరు ఎత్తిపోతల పథకాలే అని గుర్తు చేశారు.
అభివృద్ధి యజ్ఞం సాగాలంటే బీఆర్ఎస్ జెండా ఎగరాలి..
చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూశారు. గడిచిన తొమ్మిదేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూశారు. రెండింటికీ తేడా మీ కండ్ల ముందే ఉంది. 60 ఏండ్లలో పరాయి పాలకులు మనకు చేసిందేం లేదు. ఈ అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరం. మరోసారి ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరాలి. అందుకే గ్రామగ్రామాన చర్చ పెట్టండి. సీఎం కేసీఆర్ను, ఎమ్మెల్యేగా నన్ము మరోసారి ఆశీర్వదించండి. సోషల్ మీడియాలో నేను అటుపోతా, ఇటుపోతా అని అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను ఎటూ పోనూ.. సచ్చే వరకు చెన్నూర్లోనే ఉంటా. మీ ఆశీర్వాదంతో ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిసి ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తా. ఈ ఎన్నికల సంవత్సరంలో వాడోవీడో సంకాంత్రికి గంగిరెద్దులు వచ్చినట్లు వస్తుంటారు. ఒకడు వచ్చి బియ్యం పంచుతడు. ఇంకొకడు వచ్చి సీటు వచ్చిన విద్యార్థికి రూ.20 వేలు ఇస్తడు. మరొకడేమో గ్రామాల్లోకి పోయి బోర్లు వేస్తడు. మరి ఇన్ని రోజులు ఎందుకో రాలేదు. ఇప్పుడు ఎన్నికల సంవత్సరం కాబట్టి వచ్చారు. వాళ్లు పాలించినప్పుడు పింఛన్ పెంచాలనో, కల్యాణలక్ష్మి ఇవ్వాలనో ఎందుకు ఆలోచించలేదు. కేసీఆర్ లెక్క ఇంటికి పెద్ద కొడుకులా ఎందుకు కాలేదు అని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులుగా ఉండి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీ నుంచి దేశంలోనే అత్యంత ప్రధాన పార్టీగా బీఆర్ఎస్ ఎదిగిందని, రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనుందన్నారు. ఈ తరుణంలో ఐకమత్యంగా అందరం కలిసి పార్టీని అజేయ శక్తిగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల ప్రగతి నివేదికను ఆత్మీయ సమ్మేళనంలో చదివి వినిపించారు.
అహర్నిశలు కష్టపడుతున్న నేత బాల్క సుమన్..
ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ.. సిరిసిల్ల, సిద్దిపేటలకు దీటుగా చెన్నూర్ను తీసుకెళ్లడానికి బాల్క సుమన్ అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లోనూ చెన్నూర్ ప్రగతి పథంలో నడవాలంటే సుమన్ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథి నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ.. అభివృద్ధిలో దూసుకుపోతున్న రాకెట్ బాల్క సుమన్ అన్నా రు. ఇది 31 గ్రామాల ఆత్మీయ సమ్మేళనంలా లేదని, జిల్లా స్థాయి బహిరంగ సభ లా ఉందన్నారు. ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తుంటే మహాసముద్రంగా కనిపిస్తున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా మారి లక్ష మెజార్టీతో బాల్క సుమన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్, బీజేపీ అనే రెండు భూతాలు వెంటాడుతున్నాయన్నారు. కొట్లాడి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకుంటుంటే ఓర్వలేక ఎలాగైనా రాష్ట్రంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నాయన్నారు. అందుకే దేశానికి పట్టిన శని కాంగ్రెస్, దేశానికి పట్టిన దరిద్రం బీజేపీలను కేసీఆర్ నాయకత్వంలో తరిమికొట్టాలన్నారు. రాష్ట్రంలో చెన్నూర్ నియోజకవర్గంలో జరుగుతున్నట్లు మరెక్కడా ఆత్మీయ సమ్మేళనాలు జరగడం లేదన్నారు. ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యే ఓదెలు మాట్లాడుతూ.. ఆత్మీయ సమ్మేళనానికి వేలాది మంది హాజరు కావడమే సుమన్ పనితీరుకు నిదర్శనమన్నారు. సుమన్ను లక్ష మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఆదిలాబాద్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, ఎంపీపీ మంత్రి సురేఖ, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు అజ్గర్ మోహియోద్దీన్, ఏఎంసీ వైస్ చైర్మన్ బైస ప్రభాకర్, పీఏసీఎస్ చైర్మన్ సాంబాగౌడ్, రైతుబంధు మండల కన్వీనర్ గుర్రం రాజన్న, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎరినాగుల ఓదెలు, నియోకవర్గ కో-ఆర్డినేటర్ ముల్కల్ల శశిపాల్రెడ్డి, యూత్ అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్, 31 గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.