దండేపల్లి, నవంబర్13 : దండేపల్లి మండలంలోని గూడెం రమాసహిత ఆలయంలో ఆదివారం కార్తీక మాసం బహుళ పంచమి పర్వదినం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి, నదిలో కార్తీక దీపాలు వదిలారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుట్ట కింద భాగంలో రావి చెట్టు కింద, గుట్ట పైన గల ధ్వజస్తంభం వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు.
అనంతరం స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 628 మంది సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. తెలంగాణ మానవ హక్కుల కమిటీ సభ్యులు ఎన్ దివాకర్రావు కుటుంబ సభ్యులు సత్యనారాయణస్వామి వ్రతం ఆచరించారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, వేదపండితులు, అర్చకులు శేష వస్త్ర ప్రసాదాలతో సన్మానించారు.