నియమ నిష్టలతో చేసే అయ్యప్ప దీక్ష.. మనిషి ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. మండల కాలం 41 రోజుల పాటు దీక్షలో ఉన్న భక్తుడు.. దీక్ష తర్వాత కూడా దుర్గుణాలను వదిలి.. సన్మార్గంలో నడిచేలా చేస్తుంది. అందుకే పరమ పవిత్రమైన అయ్యప్ప దీక్ష తీసుకునే భక్తుడినే దేవుడిగా భావిస్తుంటారు. దీక్షలో ఉన్నవారు రోజుకోసారి మధ్యాహ్నం మాత్రమే భిక్ష(భోజనం) చేస్తారు. అందుకే మాలధారులకు భిక్ష పెట్టడానికి చాలా మంది తహతహలాడుతుంటారు. స్వాములను ఇంటికి పిలిచి భిక్ష పెడితే సాక్షాత్తూ అయ్యప్ప స్వామి ఇంటికి వచ్చి తిన్నట్లుగా భావిస్తారు. అయితే అయ్యప్ప మాలధారులు 41 రోజుల పాటు సుచిగా, పవిత్రంగా తయారు చేసే భిక్ష తినాలి. ఇంట్లో ప్రతిరోజూ తయారు చేసుకోవడం కాస్త కష్టమైన పని. ఒక్కోసారి కుదరకపోవచ్చు. అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు ఆలయాలు, పడిపూజలు జరిగే దగ్గరకు వెళ్తుంటారు. మంచిర్యాల జిల్లాలో దాదాపు 12 అయ్యప్ప దేవాలయాల్లో అన్నదానం జరుగుతుంది. సంక్రాంతి జ్యోతి దర్శనం వరకు ఈ అన్నదాన సేవలు కొనసాగుతూ ఉంటాయి. అయితే అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అయ్యప్ప అన్నదాన సేవా సమితి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నది.
మంచిర్యాల, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
అయ్యప్ప అన్నదాన సేవా సమితి పెట్టే భిక్ష అంటే అయ్యప్ప స్వాములకు ఎంతో ఇష్టం. ఇక్కడ సాంబారు, పెరుగు, రెండు కర్రీలు, చట్నీ, అప్పడాలు, ఒక ప్రై, మిర్చి/బోండా వంటి వాటితో నిత్యాన్నదానం చేస్తారు. ప్రతి బుధవారం అర్వన్నం కూడా ఉంటుంది. ఇలా ప్రతిరోజూ 300 నుంచి 350 మంది అయ్యప్ప భక్తులకు ఇక్కడ భిక్ష అందజేస్తారు. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు నస్పూర్, శ్రీరాంపూర్, లక్షెట్టిపేట, మందమర్రి, బెల్లంపలి, చుట్టు పక్కల జిల్లాలు, మహారాష్ట్ర నుంచి వివిధ పనుల కోసం వచ్చే అయ్యప్ప మాలధారులు ఇక్కడికి వచ్చి భిక్ష చేస్తారు. గడిచిన ఏడేళ్ల (2014) నుంచి ఈ ట్రస్ట్ ఉచిత అన్నదాన సేవలు అందిస్తున్నది.
మంచిర్యాల అయ్యప్ప గుడిలో రూ.1 నుంచి రూ.1000 వరకు చీటీలు రాసి ఓ డబ్బాలో వేసి గుడికి వచ్చే మాలధారులను అందులో నుంచి ఒక చీటీ తీయమనేవారు. అలా రూ.10 చీటీ వచ్చిన భక్తుడు రూ.10, రూ.1000 చీటీ వచ్చిన భక్తుడు అన్నదానం కోసం రూ.1000 ఇవ్వాలి. అలా వచ్చే డబ్బులు, దాతల సహకారంతో గుడిలో నిత్యాన్నదానం చేసేవారు. దీని కారణంగా భక్తులు ఇబ్బందులు పడడం చూసి చలించిపోయారు అక్కెనపెల్లి రవీందర్. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. రోజూ ఒక టీ తాగితే రూ.10.. అంటే సంవత్సరానికి రూ.3650 అవుతాయి. ఇలా ఐదు సంవత్సరాలకు రూ.18,250 అవుతాయి. ఆ టీ తాగే డబ్బులు ట్రస్ట్కు విరాళంగా ఇస్తే శాశ్వత సభ్యత్వం ఇచ్చి అయ్యప్ప స్వాములకు శాశ్వత అన్నదానం చేస్తామనే ఆలోచనతో ముందుకు వచ్చారు. స్తోమత ఉన్న వారిని కలిసి కొంత మొత్తంతో ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటి వరకు 150 మంది శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. ఈ శాశ్వత సభ్యత్వం కూడా 365 మంది వరకే పరిమితం. 365 మంది ఒకొక్కరూ రూ.18,250 ఇస్తే రూ.60 లక్షలకు పైగా అవుతుంది. ఆ మొత్తం ట్రస్ట్ పేరుతో ఎఫ్డీఆర్ చేసి, వచ్చే వడ్డీతో అయ్యప్పలకు యేటా 45 రోజుల పాటు భోజనం పెట్టనున్నారు. ఇది మనిషి ఉన్నా.. లేకపోయినా యేటా జరుగుతూనే ఉంటుంది.
నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా అయ్యప్ప భక్తులకు భిక్ష ఏర్పాటు చేస్తున్నాం. రోజూ 10 రకాల వెరైటీలు కచ్చితంగా ఉంటాయి. విస్తార్లు మొదలు.. తాగే నీటి వరకు ప్రతి విషయంలో స్వాముల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాణ్యతాప్రామాణాలు పాటిస్తున్నాం. రోజూ 500 మంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా భిక్ష ఏర్పాటు చేయగలం. అయ్యప్ప భక్తుడిగా ఇదో బాధ్యతగా తీసుకొని చేస్తున్నా.
– అక్కెనపెల్లి రవీందర్,ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు
భిక్షకు వచ్చే వారి కోసం అద్భుతమైన వసతులు ఉంటాయి. ప్రతీది సిస్టమేటిక్గా జరుగుతుంది. మెయింటనెన్స్ బాగుంటుంది. అందుకే వేరే దగ్గరకు వెళ్లడం కంటే ఇక్కడికి వచ్చి భిక్ష చేయడమే నచ్చుతుంది. అయ్యప్ప భక్తుల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి రోజూ భిక్ష పెట్టడం గొప్ప విషయం.
– శివకుమార్, అయ్యప్ప భక్తుడు
రూ.18,250తో శాశ్వత అన్నదానం చేస్తామంటే అంతకు మించిన భాగ్యం వేరొకటి లేదనే ఉద్దేశంతో శాశ్వత సభ్యత్వం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రతి రోజూ ఒకరిద్దరు ట్రస్ట్లో చేరుతున్నారు. అక్కెనపల్లి రవీందర్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, అప్పాల శ్రీధర్ సెక్రటరీ, కోశాధికారి వొడ్నాల రవీందర్, వైస్ప్రెసిడెంట్ తోట వెంకటేశం వేరే పనులేమీ పెట్టుకోకుండా ఈ 45 రోజుల పాటు ట్రస్ట్ కోసం మాత్రమే పని చేస్తున్నారు. వీళ్ల కమిట్మెంట్ చూసి చాలా మంది అయ్యప్ప భక్తులకు సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారు.
భిక్షకు రావాలనుకునే భక్తులు కచ్చితంగా ఉదయం 9 గంటల్లోగా టోకెన్ తీసుకోవాలి. ఎన్ని టోకెన్లు అయితే స్వాములు తీసుకుంటారో అంతే మందికి భిక్ష సిద్ధం చేస్తారు. ఆహారం వృథా కాకూడదనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టారు. దూర ప్రాంతాల్లో ఉండే భక్తుల సౌకర్యార్థం టెలిఫోన్ బుకింగ్ సౌకర్యం కూడా ఉంది. కిరణ్కుమార్కు ఫోన్ (98495 27195) చేస్తే మీ పేరు మీద టోకెన్ తీసి పక్కన పెడుతారు. భిక్షకు వచ్చాక ఆ టోకెన్ కలెక్ట్ చేసుకొని లోపలికి వెళ్లొచ్చు. ఉదయం 7 గంటలకే టోకెన్ల కౌంటర్ ఓపెన్ అవుతుంది. మంచిర్యాలలోని విశ్వనాథాలయంలోని కల్యాణ మండలంలో భిక్ష ఏర్పాటు చేస్తారు.
ట్రస్ట్ చేస్తున్న సేవల్లో పాల్గొనేందుకు మంచిర్యాలకు చెందిన కొందరు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. దాదాపు 150 మంది వాట్సాప్లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని రోజూ 20 మంది అయ్యప్ప స్వాములకు సేవ చేసేందుకు వస్తున్నారు. ఇవాళ ఒక బ్యాచ్ వస్తే రేపు మరో బ్యాచ్ వచ్చేలా రొటేషన్ పద్ధతిలో ఏర్పాట్లు చేసుకున్నారు. స్వాములకు వడ్డింపు చేయడం, భిక్ష అయిపోయాక మొత్తం క్లీన్ చేసి వెళ్లడం వీళ్ల పని.