ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, డిసెంబర్ 21 : ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు ఆగమయ్యాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ తీశారు. కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం కల్పించడం వల్ల, గిరాకీలు లేక ఆటో డ్రైవర్ల పరిస్థితి అయోమయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్ రావుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాపిడి సురేష్, సాగర్, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు