మంచిర్యాల, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా జన్నారంలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పక్షులకు స్వర్గధామం అని ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ క్విన్ల్యాండ్ ప్రొఫెసర్ ప్రదీప్ నినాన్ థామస్ అన్నారు. మూడు రోజులుగా కవ్వాల్ టైగర్ రిజర్వ్లో పర్యటించిన ఆయన గనిశెట్టికుంట, బైసన్కుంట, గొందుగూడ వ్యూ టవర్లు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో అరుదైన పక్షల ఫొటోలను ఆయన సేకరించారు. హాక్ ఈగల్స్, క్రెస్టెడ్ సర్పెంట్ ఈగల్స్, లెస్సర్ ఫిషింగ్ ఈగల్స్ అలాంటి అరుదైన పక్షులతో పాటు జంతువుల ఫొటోలను తీసినట్లు తెలిపారు.
ఇండియాలో ఇప్పటి వరకు దాదాపు అన్ని పులులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను సందర్శించానని, పక్షి వీక్షకులు తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం కవ్వాల్ టైగర్ రిజర్వ్ అని థామస్ చెప్పారు. ఈయన అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన జర్నలిజం ప్రొఫెసర్. జర్నలిజంపై దాదాపు 12 పుస్తకాలను పబ్లిష్ చేశారు. ఖాళీ సమయాల్లో ఫొటోగ్రఫీ చేయడం తనకు అలవాటని, అందులో భాగంగానే కవ్వాల్ రిజర్వ్ను సందర్శించానని ఆయన తెలిపారు.