బోథ్, జూలై 2: రైతులు వర్షధార పంటల సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో పత్తికి డిమాండ్తో పాటు మద్దతు ధర కలిసి వస్తుండడంతో పంటను వేస్తున్నారు. 26 వేల ఎకరాల్లో పంట సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బోథ్ మండలంలో ప్రతి ఏటా వానకాలం పంట కింద రైతులు 46,850 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. అత్యధికంగా వాణిజ్య పంట అయినా పత్తి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఈ వానకాలం పంట కింద 26,500 నుంచి 28 వేల ఎకరాల వరకు పత్తి సాగు చేయవచ్చని ప్రభుత్వానికి అంచనా నివేదిక సమర్పించారు.
ఈ సంవత్సరం మార్కెట్లో పత్తికి క్వింటాల్కు రూ.7 వేల నుంచి 9 వేల వరకు పలకడంతో ఈ సీజన్లో రైతులు పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్కు రూ. 7020 ప్రకటించడంతో రైతులు భరోసాతో పంట వేస్తున్నారు. ఇప్పటికే 95 శాతం వరకు విత్తనాలు వేయడం పూర్తి చేశారు. పత్తి విత్తనాలు మొలకెత్తిన పొలాల్లో ఎద్దుల సాయంతో దౌర కొడుతున్నారు. రసాయన ఎరువులు వేయడంతో పాటు పురుగు మందులు పిచికారీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. మొత్తం మీద రైతులులు ఈ యేడు వానకాలం పంట కింద వాణిజ్య పంట అయినా పత్తి సాగుకు ఆసక్తి చూపారు.
26 వేలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు…
బోథ్ మండల వ్యాప్తంగా ప్రాథమిక అంచనా ప్రకారం 26,500 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారు. విత్తనాలు వేయడం పూర్తయ్యాక క్షేత్రస్థాయిలో పర్యటించి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తాం. సాగు విస్తీర్ణం ఇంకా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో పత్తికి డిమాండ్ ఉండడంతో మెజారిటీ రైతులు పత్తి పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు.
– వెండి విశ్వామిత్ర,
మండల వ్యవసాయాధికారి, బోథ్