ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కూలీల హాజరు ఇక నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్) యాప్ ద్వారా నమోదు చేయనున్నది. కూలీల హాజరు నమోదులో పారదర్శకత పెంచేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయగా, నేటి నుంచి లైవ్ లోకేషన్ నుంచే యాప్లో పనుల వివరాలు, హాజరు అప్ లోడింగ్ జరగనున్నది. దాని ఆధారంగానే కూలీలకు డబ్బులు చెల్లించనున్నది.
– దస్తురాబాద్, డిసెంబర్ 31
ఉపాధి హామీ కూలీల హాజరు, అక్రమాల అడ్డుకట్టపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. అందులో భాగంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్ఎంఎంఎస్) ద్వారా హాజరుకు ఆదేశాలిచ్చాయి. అందుకు అనుగుణంగా మార్గదర్శకలను జారీ చేశారు. ఇప్పటి వరకు కూలీల హాజరు నమోదు మ్యానువల్గా జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ తీసుకురాగా, నేటి నుంచి పక్కగా అమలు చేసేందుకు అధికార యాంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కూలీల మాజరు, పని చేసే చోటు తదితర వివరాలను ఆన్లైన్లో పొందుపర్చన్నారు. ఆరు నెలలుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న కొన్ని మార్పులకు అధికారులకు అవకాశం ఉండేది. నేటి నుంచి సర్దుబాట్లకు అవకాశం ఉండదు. ఇక నుంచి కూలీల హాజరు, వివరాలను నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ (ఎన్ఎంఎంఎస్)లోనే నమోదు చేయాలి.
అక్రమాలకు చెక్..
2023, జనవరి 1 నుంచి యాప్ ద్వారా హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పెంచేందుకు దీనిని ప్రవేపెట్టింది. దీంతో కూలీలపై ప్రతి రోజూ ఆన్లైన్ పర్యవేక్షణ ఉంటుంది. గ్రామస్థాయిలో ఈజీఎస్ ఫీల్ట్ అసిస్టెంట్లు యాప్ డౌన్లోడ్ చేసుకొని, అందులో వివరాలను నమోదు చేసి, రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మస్టర్ల ద్వారా పనుల వద్దకు వెళ్లిన క్షేత్ర సహాయకుడు, కూలీల వివరాలు నమోదు చేసుకునేవాడు. ప్రస్తుత విధానం ద్వారా నేరుగా పని ప్రదేశంలో ఉండి, మొబైల్ యాప్లో రెండుసార్లు నిక్షిప్తం చేయాలి. క్షేత్ర సహాయకులు నిత్యం ఉదయం 7 నుంచి 11 గంటలలోపు.., మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటలలోపు క్షేత్రస్థాయిలో కూలీల వివరాలు నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్(ఎన్ఎంఎంఎస్)లో పొందుపర్చాలి. 20 మంది కూలీలకు పైగా ఉంటే ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. దీని వల్ల అలా వచ్చి, వెళ్లేందుకు వీలు ఉండదు.
ఫొటోల ఆప్లోడ్ తప్పనిసరి..
ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగకుండా ప్రభుత్వం నూతనంగా ఎన్ఎంఎంఎస్ మొబైల్ యాప్ ప్రవేశ పెట్టింది. ఇకపై కూలీలు చేస్తున్న పని ప్రదేశం, పని చేస్తున్న ఫొటోలను ప్రతి రోజూ అందులో ఆప్లోడ్ చేయాలి. ఈ విధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పనికి వచ్చిన కూలీలకు మాత్రమే డబ్బుల చెల్లింపులు చేపట్టనున్నారు. ఫొటోలు అప్లోడ్ చేస్తేనే కూలీ చెల్లిస్తారు.
– రవి ప్రసాద్, ఏపీవో, దస్తురాబాద్