నిర్మల్, మార్చి 28(నమస్తే తెలంగాణ) ; ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఆరు రోజులుగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో వస్తుండడంతో సమ్మేళనాల ప్రాంగణాలు జన జాతరను తలపిస్తున్నాయి. తాజాగా మంగళవారం నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి.. కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని నిరాల, బేల మండలంలోని పొనాల గ్రామాల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న.. తాంసి మండలంలోని అంబుగాం గ్రామంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. మండలంలోని 20 పంచాయతీల నుంచి మహిళలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మొదటగా పార్టీ జెండాను ఆవిష్కరించి, అనంతరం గిరిజన మహిళలతో కలిసి గుస్సాడీ నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన వద్ద అమలవుతున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వ్యవసాయానికి ఐదు గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదన్నారు. రూ.600లకు మించి పింఛన్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను పూర్తిస్థాయిలో కొనడం లేదని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అమలు చేయడం వల్ల రాష్ట్రంలో బాల్య విహహాలు తగ్గాయన్నారు.
కంటి వెలుగు, కేసీఆర్ కిట్ ద్వారా ఆరోగ్య తెలంగాణగా మారింది. పోన్కల్ను మండల కేంద్రం గా ఏర్పాటు చేయాలని పలువురు మంత్రి దృష్టికి తీసుకురాగా.. కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హై లెవల్ కెనాల్ నిర్మాణం పూర్తి చేసి, గుట్ట మీది గ్రామాలకు సాగు నీరు అందిస్తామన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో 700లకు పైగా ఆలయాల నిర్మాణం చేసి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించామన్నారు. 300 మంది టెన్త్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను కమల్కోట్కు చెందిన విజయ్కుమార్రెడ్డి, పొన్కల్ ఉప సర్పంచ్ నరేశ్రెడ్డి మంత్రి చేతుల మీదుగా అందజేశారు. మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు, మంత్రి తనయుడు గౌతంరెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, వైఎస్ ఎంపీపీ లింగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చం ద్రశేఖర్గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, స ర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు భూమేశ్వర్, నాయకులు నవీన్రావు, భూషణ్రెడ్డి,రఫీ,అశోక్, వికాస్రెడ్డి, లింగారెడ్డి, అలీం, పాషా, సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రగతిని వివరించాలి..
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని, 14 ఏండ్లుగా సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్లో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఎమ్మె ల్సీ, ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అభివృద్ధిని వివరించేందుకే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధిని ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దగా పడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదన్నారు. అభివృధ్ధిని అడ్డుకుంటూ రాష్ర్టానికి రావాల్సిన నిధులను రాకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు. గతంలో మంచినీటి కోసం బిందెలతో ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయని, ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలాన్ని అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ విస్తృతంగా తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని, రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీజేపీ, కాంగ్రెస్లకు ఓట్లు అడిగే హక్కు లేదు..
రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదని, బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఒక్క లింగాపూర్ గ్రామంలోనే 1700 పింఛన్లు అందుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఉత్తమ పంచాయతీల సర్పంచ్లను శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ కట్టా శ్యాం సుందర్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీక్, సర్పంచ్ ఆకుల బాలవ్వ, ఎంపీటీసీ, ఆత్మ కమిటీ చైర్మన్ సతీష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
బీజేపీ నాయకుల్లారా ఖబడ్దార్
ప్రభుత్వంపై బీజేపీ నాయకు లు అవాకులు, చెవాకులు పేల్చుతున్నారు. ఖబడ్దార్ బీజేపీ నాయకుల్లారా.. మీరు ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలోనే నియోజకవర్గం అభివృధ్ధి చెందుతుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గెలిపిందాం.
– కట్టా శ్యాంసుందర్, వైస్ ఎంపీపీ, కడెం.
మిషన్ పథకం ద్వారా చెరువుల అభివృద్ధి
నచ్చన్ ఎల్లాపూర్లో రెండు చెరువులను మిషన్ కాకతీయ ద్వారా ప్రభు త్వం అభివృద్ధి చేసింది. దీంతో ఆయకట్టు పెరగ డంతోపాటు చేప పిల్లల పెంపకంతో గతంలో కంటే రూ.70 వేల ఆదాయం గ్రామానికి వస్తున్నది. ఎమ్మెల్యే రేఖానాయక్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి.
– కానూరి సతీష్, ఆత్మ కమిటీ చైర్మన్, నచ్చన్ ఎల్లాపూర్.
పార్టీని బలోపేతం చేసేందుకే సమ్మేళనాలు..
బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఆత్మీయ సమ్మేళనాలకు కార్యకర్తలే భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యకర్తలు ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. వచ్చే నెల 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
– నిర్మల్ జిల్లా కో-ఆర్డినేటర్ గంగాధర్ గౌడ్