అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సోమవారం ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే నెల 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. తాజాగా సీఈసీ ఓటర్ల జాబితాను కూడా ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 22,21,903 మంది ఓటర్లు ఉండగా.. మంచిర్యాల సెగ్మెంట్లో అత్యధికంగా.. బెల్లంపల్లిలో అత్యల్పంగా ఉన్నారు.
కాగా.. షెడ్యూల్ విడుదలకు నెల రోజుల ముందే భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులను ప్రకటించగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం కనీసం అభ్యర్థులను కూడా ప్రకటించక అయోమయంలో ఉన్నాయి. గడిచిన పది రోజుల్లో మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు మంచిర్యాల, చెన్నూర్, నిర్మల్ నియోజకవర్గాల్లో పర్యటించారు. వీటితోపాటు ఖానాపూర్, ముథోల్, బెల్లంపల్లి సెగ్మెంట్లు కూడా పూర్తయ్యాయి. అమాత్యుల పర్యటనతో బీఆర్ఎస్ శ్రేణులు జోష్ మీదున్నాయి.
– మంచిర్యాల, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాజకీయ పార్టీలు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలతోపాటు ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లోనూ శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాలకు ఒకే దఫాలో ఎన్నికలు ఉండనున్నాయి.
ఈ మేరకు నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నది. వచ్చే నెల 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఆ రోజు నుంచి నవంబర్ 10 తేదీలోపు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలి. అదేనెల 15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 22.21 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 2.64 లక్షలు, నిర్మల్లో 2.47 లక్షలు, ముథోల్లో 2.46 లక్షలు, ఆదిలాబాద్లో 2.35 లక్షలు, ఆసిఫాబాద్లో 2.24 లక్షలు, సిర్పూర్ 2.23 లక్షలు, బెల్లంపల్లి 1.69 లక్షలు, చెన్నూర్లో 1.84 లక్షలు, మిగిలిన నియోజకవర్గాల్లో రెండు లక్షల పైచిలుకు మంది ఓటర్లు ఉన్నారు.
ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఇప్పటికే నెల రోజులు దాటింది. దీంతో అధికార పార్టీ అభ్యర్థులంతా ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు చాలా నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే ఇందులో మంచిర్యాల, చెన్నూర్, నిర్మల్ నియోజకవర్గాల్లో మంత్రుల పర్యటనలు పూర్తయ్యాయి. వీటితోపాటు ఖానాపూర్, ముథోల్, బెల్లంపల్లి నియోజకవర్గాలు కూడా కవర్ అయ్యాయి.
మంత్రుల టూర్లతో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు నూతనోత్సాహంతో కదం తొక్కుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల ముందే అధికార బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో దాదాపు 40 శాతం నుంచి 50 శాతం ప్రచారాన్ని పూర్తి చేసింది. మంత్రుల టూర్లతోపాటు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉండి మరోసారి టికెట్ దక్కించుకున్న నేతలు గడిచిన నెల రోజుల్లో రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. దీంతో బీఆర్ఎస్కు జనంలో పాజిటివ్ వేవ్ క్రియేట్ అయ్యింది.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి కష్టనష్టాలు తెలుసుకుంటూ ఎన్నికల కదనరంగంలో తమదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతుంటే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎవరు పోటీ చేస్తారు, ఎవరికి టికెట్ ఇస్తారో తేల్చుకోలేని దుస్థితిలో రెండు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్లో మేం పోటీ చేస్తామంటే మేం పోటీ చేస్తామంటూ, మాకు టికెట్ ఇస్తారంటే మాకు టికెట్ ఇస్తారంటూ ఎవరికీ వారే ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. బీజేపీలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఈ రెండు పార్టీలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కనీసం నలుగురు మొదలు 20 మంది వరకు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు.
అంతర్గత కుమ్ములాటలు, టికెట్ మాకే కావాలంటే నిరసనలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ టికెట్ కోసమైతే ఓ వర్గం వారు ఏకంగా హైదరాబాద్లోని గాంధీ భవన్ ముందే ధర్నాకు దిగారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఓ నాయకురాలికి మద్దతుగా భారీ ర్యాలీలు తీశారు. ఇక సీనియర్ లీడర్లు ఉంటారనుకున్న మంచిర్యాల, బెల్లంపల్లి, నిర్మల్ నియోజకవర్గాల్లో మరోవర్గం నాయకులు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలు ఇప్పట్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. పోనీ ఒక వేళ ప్రకటించినా టికెట్ రాని అసంతృప్తులను బుజ్జగించి అందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చేలోగా ఎన్నికల ప్రచారమే పూర్తి కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో ప్రతిపక్షాల పోటీ ప్రశ్నార్థకంగా మారింది. టాప్గేర్లో దూసుకుపోతున్న బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్, బీజేపీ కనీసం పోటీ ఇస్తాయా.. లేదా.. అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.