వాంకిడి. మార్చి 13: వేటకు వెళ్తున్నారనే నెపంతో అటవీ శాఖ సిబ్బంది ముగ్గురిని చితకబాది, డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. మండలంలోని కోమటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త దుబ్బగూడ గ్రామానికి బోయిరే మల్లయ్య, చిచోలర్ గణపతి, బోయిరే రమేశ్ ఐదు రోజుల క్రితం చేపల వేట కోసం వలలతో బయల్దేరారు. గ్రామ శివారులోని పోశమ్మ ఆలయం సమీపంలో వీరిని ఇద్దరు అటవీ శాఖ సిబ్బంది ఆపారు. వలలను చూసి వన్యప్రాణుల వేటకు వెళ్తున్నారంటూ చితకబాదారు. ముగ్గురినీ ఖమాన గ్రామంలోని ఓ గదిలో బంధించారు.
ఆ తర్వాత ముగ్గురి దగ్గర నుంచి రూ. 40 వేలు డిమాండ్ చేశారు. బాధితులు గ్రామ మాజీ ఉపసర్పంచ్ పురుషోత్తంను ఆశ్రయించగా, ఆయన అటవీ శాఖ సిబ్బందితో మాట్లాడి రూ. 25 వేలకు బేరం కుదిరించాడు. మంగళవారం రాత్రి అటవీశాఖ సిబ్బందికి ఉపసర్పంచ్ డబ్బులు ఇస్తున్నప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విషయం బయటకు పొక్కడంతో ఎఫ్ఆర్వో అప్పలకొండ బుధవారం విచారణ చేపట్టారు. బాధితులు, గ్రామస్తులతో మాట్లాడారు. వీడియో, ఆడియోను పరిశీలించారు. తప్పు తేలితే అటవీశాఖ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.