మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణులు ఫుల్జోష్ మీద ఉన్నాయి. జూన్లోనే రెండుసార్లు రావడం, రూ.వేల కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయడంతో నూతనోత్సాహాన్ని నింపింది. రెండు సభలకు ఇసుకేస్తే రాలనంత జనం తరలివచ్చారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపు ప్రజానీకం ఆద్యంతం శ్రద్ధగా ఆలకించారు. చలోక్తులు విసరడంతో సభలో నవ్వులు విరబూశాయి. ధరణిపై మాట్లాడుతూ కాంగ్రెస్పై పంచులు వేయడంతో ప్రజలు మద్దతు పలికారు. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో వేయాలని నినదించారు. ఊహించని విధంగా పింఛన్ రూ.4,116 ప్రకటించడంతో దివ్యాంగులు దిల్ ఖుష్ అయ్యారు. పేదల దేవుడు కేసీఆర్ అని పొగిడారు.
మంచిర్యాలటౌన్, జూన్ 10 : మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటనలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నయాజోష్ మొదలైంది. మంచిర్యాల జిల్లా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో రూ. 2915 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు. అలాగే దివ్యాంగులకు ఇస్తున్న రూ. 3016 పింఛన్ను మరో రూ. 1000 పెంచి రూ. 4016 ఇస్తున్నట్లు ప్రకటించారు. మంచిర్యాలలోని నస్పూరులో శుక్రవారం సమీకృత కలెక్టరేట్ భవనం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. చెన్నూరు నియోజకవర్గంలో 90 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు రూ. 1658 కోట్లతో నిర్మించే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, అలాగే హాజీపూర్ మండలం పడ్తనపల్లిలో 10 వేల ఎకరాలకు సాగు నీరందించడం కోసం రూ. 83 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంఖుస్థాపన చేశారు. రూ. 164 కోట్లతో మంచిర్యాల – అంతర్గాం మధ్య గోదావరి నదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం, రూ. 510 కోట్లతో గుడిపేటలో మెడికల్ కాలేజీ నిర్మాణం, దానికి అనుబంధంగా 300 పడకల దవాఖాన నిర్మాణం, మందమర్రిలో రూ. 500 కోట్లతో ఆయిల్పామ్ ఫ్యాక్టరీలకు శంఖుస్థాపన చేశారు.
మొత్తంగా రూ. 2915 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసి రికార్డు సృష్టించారు. గతంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు వెచ్చించిన సందర్భాలు లేవు. ఇక సీఎం రాక సందర్భంగా 30 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సైతం జనం పోటెత్తారు. లక్షకు పైగా తరలివచ్చిన జనం సీఎం ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యారు. మరికాసేపు సీఎం మాట్లాడితే బాగుండేదని పలువురు చర్చించుకున్నారు. మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు రానున్న సందర్భంలో సీఎం కేసీఆర్ పర్యటన బీఆర్ఎస్ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. సింగరేణి కార్మికులకు రూ. 700 కోట్లు లాభాలు పంచి ఇస్తామని చెప్పడంతో ఆయా కుటుంబాల్లో ఆనందం వ్యక్తమైంది.
కేంద్రంలోని బీజేపీ , కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అరాచకాలను, వారి పాలనను విడమరిచి చెప్పి మనం ఏం సాధించుకున్నామో వివరించడం లాంటి అంశాలను ప్రజలు ఆసక్తిగా విన్నారు. సీఎం ప్రసంగంలో సమయానికి తగ్గట్లు ఛలోక్తులు విసిరిన సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున చప్పట్లతో పాటు కేరింతలు కొట్టారు. మరోవైపు ఈనెల 4న సీఎం కేసీఆర్ నిర్మల్లో పర్యటించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో నిర్మల్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 396 గ్రామ పంచాయతీలకు ఒక్కో జీపీకి రూ. 10 లక్షల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జిల్లావ్యాప్తంగా ఉన్న 19 మండలాలకు ఒక్కో మండలానికి రూ. 20 లక్షల చొప్పున , జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు ఒక్కోదానికి రూ. 25 కోట్ల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇలా మొత్తం రూ. 118.40 కోట్లను జిల్లాకు కేటాయించడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే త్వరలోనే బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇక మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తమ నియోజకవర్గంలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని చేసిన విన్నపానికి స్పందించిన సీఎం కేసీఆర్ వెంటనే అనువైన ప్రదేశంలో ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిర్మల్లో జరిగిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మంచిర్యాల, నిర్మల్ సభల్లో సీఎం కేసీఆర్ ఉపన్యాసాలు, చేపడుతున్న అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపుల పై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
=