ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందుకు సాగుతున్నది. కుష్టు వ్యాధి నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బాధితులను గుర్తించేందుకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు లెప్రసీ కేస్ డిటేక్షన్ క్యాంపెయిన్(ఎల్సీడీసీ) పేరుతో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నది. ఈ మేరకు దస్తురాబాద్ మండలంలో 18 బృందాలు, 5గురు సూపర్వైజర్లతో కొనసాగిస్తున్నది. మొత్తంగా5,899 ఇండ్లు ఉండగా, 2,494 ఇండ్లలో సర్వే పూర్తయ్యింది. బాధితులు ఉంటే వారికి వ్యాధి నయం అయ్యే వరకు ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా చికిత్సతో పాటు, మందులు అందిస్తున్నది.
– దస్తురాబాద్, ఆగస్టు 20
కుష్టువ్యాధి కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బాధితులను గుర్తించేందుకు మండలంలో ఈ నెల 16 నుంచి 31వ తేదీ వరకు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నది. ఆశ కార్యకర్తలు అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాల ద్వారా వ్యాధి కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. ఈ సర్వేలో కేవలం కుష్టు అనుమానితుల వివరాలను మాత్రమే సేకరిస్తారని, సర్వేకు వచ్చిన వైద్య సిబ్బందికి, ఆశ కార్యకర్తలకు, సంబంధిత వైద్యాధికారులు సూచిస్తున్నారు. కుష్టుపై నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్లో అంగవైకల్యం ఏర్పడుతుందని, లక్షణాలు కనిపిస్తే ఆశ కార్యకర్తలకు తెలియజేయాలని సూచిస్తున్నారు. బాధితులకు వ్యాధి న యం అయ్యేదాకా ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా చికిత్స, మందులు అందించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
18 బృందాల ద్వారా సర్వే..
దస్తురాబాద్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం పరిధిలో 18 బృందాలు, ఐదుగురు సూపర్వైజర్ల ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. పీహెచ్సీ కేంద్రం పరిధిలో 5,899 ఇండ్లు ఉండగా, 23,855 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 2,794 ఇండ్లలో సర్వే పూర్తి చేశారు. ఇందులో 2,045 ఇండ్లలో సర్వే పూర్తి చేసి వివరాలను నమోదు చేసుకున్నారు. సర్వే చేసిన ఇండ్లలో 321 ఇండ్లలో ప్రజలు లేరు. ఇప్పటి వరకు 581 ఇండ్లను సూపర్వైజర్లు పరిశీలించారు.
కుష్టు లక్షణాలు..
మైకో బ్యాక్టీరియం లెప్రి అనే సూక్ష్మక్రిమి ద్వారా కుష్టు వ్యాధి సంక్రమిస్తుంది. శరీరంపై లేత గోదుమ రంగు, తెల్లని, ఎర్రటి రంగులతో స్పర్శ లేని మచ్చలు ఉంటే దానిని వ్యాధి లక్షణంగా చెప్పవచ్చు. ఐదు కంటే తక్కువ మచ్చలుంటే పాసీ బెసలరీ లెప్రసీ అని, ఐదు కంటే ఎక్కువ మచ్చలుంటే మల్టీ బెసలరీ లెప్రసీ అని చెప్పవచ్చు. ఈ వ్యాధి బారిన పడిన వారి చర్మంపై గోధుమ రంగు, తెల్లని, ఎర్రటి మచ్చలు ఏర్పడుతాయి. అరిచేతులు, అరికాళ్లలో కండరాల బలహీనత, అంగవైకల్యం వంటివి కనిపిస్తాయి. అరిచేతుల్లో స్పర్శ కోల్పోవడం, చల్లని, వేడి వస్తువులను గుర్తించలేకపోవడం, పాదాల్లో తిమ్మిర్లు వంటి తదితర లక్షణాలు ఏర్పాడుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కుష్టు వ్యాధి భారి పడినవారు వైద్యుల సూచన మేరకు తప్పకుండా చికిత్స తీసుకొని మందులు వాడాల్సి ఉంటుంది. వీరు వస్తువును స్పర్శ శాతం తక్కువగా ఉంటుంది. ఫలితంగా వేడి వస్తువులకు దూరంగా ఉంటూ వాటిపై జాగ్రత్తగా ఉండాలి. స్పర్శ కోల్పోయిన కాళ్లు, చేతులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మచ్చలు ఉన్న ప్రాంతంలో ప్రతిరోజూ వేడి నీటితో శుభ్రం చేయాలి.
వ్యాధి నిర్మూలనకు ప్రజలు సహకరించాలి..
ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం పరిధిలో 18 బృందాలు, ఐదుగురు సూపర్వైజర్ల ద్వారా సర్వే నిర్వహిస్తున్నాం. ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. ఇప్పటివరకు 2,794 ఇండ్లలో సర్వే పూర్తి చేశాం. స్పర్శలేని ఎర్రని రాగి, గోధుమ రంగు మచ్చలు, కాళ్లుచేతులు తిమ్మిర్లు, చేతి, పాదాల వేళ్లు వంకరకావడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలను సంప్రదించాలి. ఈ వ్యాధి నిర్మూలనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిగా ఉచిత చికిత్స అందించి, మందులు పంపిణీ చేస్తాం. మొదటి దశలోనే వ్యాధి లక్షణాలుంటే వైద్య సిబ్బందికి, ఆశ కార్యకర్తలకు తెలియజేయాలి. చికిత్స చేసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. ఎల్సీడీసీ(జాతీయ కుష్టు వ్యాధి) నిర్మూలనకు ప్రజలు వైద్య సిబ్బందికి సహకరించాలి.
– టీ వేణుగోపాల్, హెచ్ఈవో, పీహెచ్సీ, దస్తురాబాద్