Arjun Loddi | తిర్యాణి, మే 15 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మెస్రంగూడ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు ఐదు కిలో మీటర్ల (మండల కేంద్రానికి 15 కిలో మీటర్లు) దూరంలోనున్న అర్జున్లొద్ది ( Arjun Loddi ) పర్యాటకులను ఆకర్షిస్తున్నది. దట్టమైన అటవీప్రాంతంలో ఎత్తయిన గుట్టల మధ్యనున్న ఈ అతిపెద్ద సొరంగం. దీని చుట్టూ పచ్చని చెట్లు.. కొలను.. చూడముచ్చటగొలుపుతున్నాయి. స్వాతంత్య్రోద్యమం సందర్భంగా ఉద్యమకారులకు ఈ సొరంగం ఉపయోగపడిందని పెద్దలు చెబుతుంటారు. పంచపాండవుల్లో ఒకరైన అర్జునుడి ఆలయం ఇక్కడ ఉంది. పూర్వం పాండవులు ఈ ప్రాంతంలో తిరిగారని, అర్జున్లొద్ది గుహల్లో బంగారు కిరీటాలను ఉంచారని గిరిజనులు చెబుతుంటారు. అరణ్యవాస సమయంలో భీముడు గిరిజన స్త్రీని వివాహమాడి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని, తామంతా భీముడి సంతానమని నమ్ముతారు.
ఈ ప్రాంతంలోని గిరిజనులు ఎక్కువ శాతం భీముడు,అర్జునుడు పేర్లనే పెట్టుకుంటారు. అర్జున్లొద్ది సొరంగం చూడాలని చాలా మంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు. టార్చ్లైట్లు పట్టుకొని కొంత దూరంలోకి వెళ్లగా, ఊపిరాడక వెనుదిరిగిన వారున్నారు. ఈ సొరంగం ఎంత లోతులో ఉన్నది.. ఎంత దూరం వరకు ఉన్నది అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు. దీనిపై స్పష్టమైన అవగాహన ఉన్నవారు ఇప్పటికీ లేరు. సొరంగం లోపలి భాగానికి వజ్రపు మెరుగు ఉంటుందని, ఒక స్తంభం అయితే దగదగలాడుతూ ఉంటుందని గిరిజనులు చెబుతూ ఉంటారు.
అర్జున్లొద్ది అద్భుతమైన ఆరాధన స్థలంగా విరజిల్లుతున్నది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ నుంచి ప్రజలు భారీ సం ఖ్యలో ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా పొలాల్లో విత్తనాలు చల్లేటప్పుడు, పంటను కోసే ముందు గిరిజనులు ఈ సొరంగం వద్ద పండుగ చేసుకుంటూ ఉంటారు. అలాగే సకాలంలో వర్షాలు కురియక పోయినా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే వరుణుడు కరుణిస్తాడని వీరి ప్రగాఢ విశ్వాసం. ఈ సొరంగం వద్దకు వచ్చే వారు భక్తితో, నియమ నిష్ఠలతో రావాలని.. లేని పక్షంలో దేవునికి కోపం వచ్చి తేనేటీగల రూపంలో వచ్చి తప్పు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతాడని గిరిజనులు నమ్ముతారు. యేటా సంస్కృతీ, సంప్రదాయం ప్రకారం ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక్కడికి స్థానిక ప్రజాప్రతినిధులే కాకుండా నలుమూలల నుంచి గిరిజను లు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
సొరంగం లోపల ఆవు పొదుగులాంటి ప్రదేశం కూడా కనిపిస్తుంది. దాని కింద చేయిపెడితే అదృష్టవంతులకు క్షీరధారలు పడుతాయని అంటూ ఉంటారు. ఎత్తయిన కొండల నుంచి పరుపు బండలపై తెల్లటి పాల నురగలా చూడముచ్చటగా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. గుహకు వెనుక భాగాన ప్రవహిస్తుంది. అక్కడ ద్రౌపతి స్నానం చేస్తుండేదని చెబుతుంటారు. దీనిని కొలనుగా పిలుస్తారు.
అర్జున్లొద్ది గుహ ప్రాంతం పర్యాటక పరంగా ఆకట్టుకుంటున్నది. చుట్టూ దట్టమైన అడవులు, కొలను, జలపాతాలు ఆహ్లాదం పంచుతున్నాయి. సరైన రోడ్డు సౌకర్యం లేక వానకాలంలో ఈ గుహను చేరుకోవాలంటే ఎంతో శ్రమ పడాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం అందమైన ప్రదేశాలను, విశిష్టతలను గుర్తించి పర్యాటక కేంద్రాలుగా గుర్తిస్తున్న తరుణంలో ఇంత ఘన చరిత్ర ఉన్న అర్జున్లొద్ది ప్రాంతాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందమైన ప్రదేశాలను గుర్తించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నది. చింతలమాదర,గుండాల జలపాత ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా గుర్తించింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న అర్జున్లొద్ది ప్రాంతాన్ని కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. ఈ ప్రాంతం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. యేటా అక్కడికి వెళ్తాను.
– వెడ్మ భగవంతరావు, తుడుందెబ్బ డివిజనల్ అధ్యక్షుడు, కన్నేపల్లి
రాష్ట్ర ప్రభుత్వం పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ఆలయాలను అభివృద్ధి చేసింది. అర్జున్లొద్ది ప్రాంతం చాలా బాగుంటుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి సౌకర్యాలు కల్పించాలి.
– దిందర్శ, సర్పంచ్, మెస్రంగుడ.
అర్జున్లొద్ది ఆలయం వద్ద యేటా వార్షికోత్సవం నిర్వహిస్తాం. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. సంస్కృతీ సంప్రదాయాల నడుమ పూజలు చేస్తారు. ఈ ప్రాంతం అత్యంత ప్రీతివంతమైన ఆరాధన స్థలం. ఈ ఆలయం వద్ద కనీస సౌకర్యాలు కల్పించినట్లయితే భక్తులకు ఇబ్బందులు ఉండవు.
– ఆత్రం మారు, పూజారి.
అర్జున్లొద్ది గుహ వరకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. వానకాలంలో మస్తు తిప్పలైతంది. యేటా లక్షలాది రూపాయలు వెచ్చించి మట్టి రోడ్డు వేస్తున్నారు. కానీ.. వానకాలంలో రోడ్డు కొట్టుకుపోయి గుంతలమయమవుతున్నది. దీంతో భక్తులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తిర్యాణి నుంచి అర్జున్లొద్ది గ్రామం మీదుగా గుహల దాకా సీసీ రోడ్డు నిర్మించాలి.
– పెందోర్ ధర్ము, ఆదివాసీ ఉద్యమ నాయకుడు
అర్జున్లొద్ది గ్రామం నుంచి పుణ్యక్షేత్రం (గుహ) వరకు సీసీ రోడ్డు నిర్మించి నీటి వసతి, హాలు వంటి మౌలిక వసతుల కోసం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తాం.
– సురేశ్ గౌడ్, పంచాయితీ కార్యదర్శి, మెస్రంగూడ