ఎదులాపురం, అక్టోబర్ 24 : ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చౌరస్తా నుంచి 400 మంది బీఎస్ఎఫ్, జిల్లా పోలీస్ సిబ్బందితో కలిసి నిర్వహించిన ఫ్లాగ్మార్చ్ను జెండా ఊపి ప్రారంభించారు. ఫ్లాగ్మార్చ్ ఎన్టీఆర్చౌక్, వినాయక్చౌక్, మసూద్చౌక్, దేవిచంద్చౌక్, అంబేద్కర్చౌక్, నేతాజీ చౌక్, మీదుగా స్థానిక బస్టాండ్ వరకు ముగిసింది. ఈ ర్యాలీలో కేంద్ర బలగాలైన రెండు కంపెనీల బీఎస్ఎఫ్ , ఆర్ఐ సిబ్బంది , స్పెషల్పార్టీ, క్యూఆర్టీ, హోంగార్డుతో కలిపి 400 మంది సిబ్బందితో ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల ఆదేశాల మేరకు ఫ్లాగ్మార్చ్ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సంజయ్, ఆదిలాబాద్ డీఎస్పీ వీ ఉమేందర్, సీఐలు కే సత్యనారాయణ, అశోక్, సైదారావ్, ప్రణయ్, ఎస్బీ ఎస్ఐ అన్వర్ఉల్హక్, ఎస్ఐలు విష్ణువర్ధన్, ముజాహిద్, నవీన్గౌడ్, కలీం, సిబ్బంది పాల్గొన్నారు.
శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలి
నిర్మల్ జిల్లాలో నవంబర్ 30న శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలని ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి పారా మిలటరీ నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ సూచనల ప్రకారం విధులు నిర్వహించాలని, రాబోయే శాసన సభ ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుంచే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించామన్నారు. ఇందులో నార్మల్ పోలింగ్ కేంద్రాలు 590, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు136, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలు 17 గుర్తించామని తెలిపారు. ఎవరైనా చట్ట విరుద్దంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరూ ఓటరుగా నమోదు చేసుకొని ఓటు హక్కును నిర్బయంగా వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం పట్టణంలోని గాంధీచౌక్, బుధవార్పేట్, జామమసీద్, చింతకుంట వార్డుల గుండా మార్చ్ కొనసాగింది. కార్యక్రమంలో డీఎస్పీ గంగారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐ పురుషోత్తం చారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రాం నిరంజన్, రమేశ్, రామకృష్ణ, ఎంటీవో వినోద్, ఎస్ఐలు, సాయుధ దళ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.