నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ. 166 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చొరవతో పనులు శరవేగంగా కొనసాగుతుం డగా, మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నది. 2023-24 విద్యా సంవత్సరం తరగతులు మొదలుకానుండగా, ఇప్పటికే ప్రొఫెసర్లను సైతం నియమించింది. ఈ నెలాఖరు వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఇప్పటికే 68 మంది విద్యార్థులను ఎంపిక చేయగా, ఇంకా 32 సీట్లు భర్తీ కావాల్సి ఉంది.
– నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 4
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 4 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్ సమీపంలో రూ.166 కోట్లతో ఐదెకరాల్లో మెడికల్ కళాశాల నిర్మిస్తున్నారు. 2022 మేలో పనులు ప్రారంభమయ్యాయి. మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి శరవేగంగా పనులు పూర్తి చేయించారు. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. అక్టోబర్ 1 నుంచి తరగతులు మొదలయ్యే అవకాశముండగా, ఆ లోగా కళాశాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించగా, విద్యార్థులు నిర్మల్ మెడికల్ కళాశాలను ఎంపిక చేసుకున్నారు.
85 శాతం పనులు పూర్తి..
నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలో మొత్తం ఆరు బ్లాకులు ఉన్నాయి. నాలుగు సెల్లార్లు, మూడు ఫ్లోర్లలో కళాశాలను నిర్మిస్తుండగా, ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఇంకో 15 శాతం పనులు మిగిలి ఉన్నాయి. కళాశాల తరగతులు నిర్వహించుకునేందుకు 100 శాతం పనులు పూర్తికాగా, 15 శాతం పనుల్లో హాస్టల్ భవన నిర్మాణం మిగిలి ఉంది. ఈ సెప్టెంబర్లోనే పనులన్నీ పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే మెడికల్ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సరిపోయే తరగతి గదులు సిద్ధమవుతున్నాయి. ల్యాబ్ పరికరాలు కూడా రాగా, ప్రాక్టికల్స్ తరగతులకు సిద్ధం చేశారు.
100 మెడికల్ సీట్లకు..68 మంది ఎంపిక
నిర్మల్ జిల్లాకు మెడికల్ కళాశాల ద్వారా ఏటా 100 సీట్ల చొప్పున ఐదేళ్లపాటు 500 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందులో 85 శాతం సీట్లను రాష్ట్ర కోటా ద్వారా.. మిగతా 15 శాతం సీట్లను ఆలిండియా కోటా ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటివరకు 68 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఇందులో స్టేట్ కోటా ద్వారా 58 మంది మెడికల్ విద్యార్థులు, ఆలిండియా కోటా ద్వారా 10 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఇంకా 32 సీట్లు భర్తీ కావాల్సి ఉంది. ఇందులో స్టేట్ కోటాలో 17 సీట్లు, ఆలిండియా కోటాలో 10 సీట్లు భర్తీ కావాల్సి ఉంది. స్టేట్ కోటాలో మూడు రౌండ్ల ద్వారా సీట్లు భర్తీ కానుండగా, ఇప్పటివరకు ఒక్క రౌండే పూర్తయింది. ఇంకా రెండు రౌండ్లు కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. ఆలిండియా కోటాలో రెండు రౌండ్ల ద్వారా సీట్లను భర్తీ చేయనుండగా, రెండో రౌండ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. అడ్మిషన్ల ప్రకియ సెప్టెంబర్ నెల చివరి వరకు కొనసాగనుంది. దీంతో వంద శాతం సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
ప్రొఫెసర్ల చేరిక..
మెడికల్ కళాశాలలో 2023-24 విద్యాసంవత్సరానికి తరగతులు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రొఫెసర్లను నియమించింది. ఇప్పటికే మెడికల్ కళాశాలకు 24 మంది ప్రొఫెసర్లను యూనివర్సిటీ నియమించింది. మెడికల్ కళాశాలకు మొత్తం ఆరుగురు ప్రొఫెసర్లు అవసరం ఉండగా, ఇప్పటికే ఇద్దరు ప్రొఫెసర్లు వచ్చారు. పది మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ముగ్గురు ప్రొఫెసర్లు రాగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 40 మందికి 19 మంది ప్రొఫెసర్లు చేరారు. త్వరలో పూర్తి స్థాయిలో రానున్నారు.
ఫౌండేషన్ కోర్సులు ప్రారంభం?
మెడికల్ కళాశాల నిబంధనల ప్రకారం త్వరలో ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫౌండేషన్ కోర్సును ప్రారంభించేందుకు రెండు లెక్చరర్ గ్యాలరీను సైతం సిద్ధం చేశారు. వీటితోపాటు మొదటి సంవత్సరం విద్యార్థులకు సరిపోయేలా బయోకెమిస్ట్రీ, అనాటమీ, ఫిజియాలజీ మూడు ప్రాక్టికల్ ల్యాబ్లు సైతం రెడీ అయ్యాయి. ఫౌండేషన్ కోర్సుల్లో భాగంగా మెడికల్ విద్యార్థులకు లాంగ్వేజి స్కిల్స్, పేషెంట్ కమ్యూనికేషన్, డాక్టర్ అండ్ పేషెంట్ రిలేషన్స్, సాఫ్ట్ స్కిల్స్, యోగా, ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్లపై నిర్వహించే ఫౌండేషన్ కోర్సులు ప్రారంభం కానున్నాయి.