ఎదులాపురం, డిసెంబర్ 23 : రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 2022-23 సంవత్సరానికి రాయితీతో కూడిన యూనిట్లను మంజూరు చేసేంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వారికి అండగా ఉండి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వని రీతిలో రుణాల్లో రాయితీ శాతం ఇచ్చింది. రూ.లక్ష యూనిట్కు 80 శాతం, రూ.1లక్ష నుంచి రూ. 2 లక్షల యూనిట్కు 70 శాతం రాయితీ రుణాలు అందిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 111 యూనిట్లు మంజూరు కాగా, వీటి కోసం రూ.1.8 కోట్లు మంజూరు చేశారు. ఇందులో కేటగిరి -1లో రూ.లక్ష లోపు 78యూనిట్లు, కేటగిరి-2లో 33 యూనిట్లు ఉన్నాయి.
అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత గ్రామసభలో ఎంపిక కావాల్సి ఉంటుంది. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను సంబంధిత ఎంపీడీవో లాగిన్లోకి వస్తుంది. అలాగే మున్సిపల్ కమిషనర్ లాగిన్ నుంచి మైనార్టీ కార్పొరేషన్ లాగిన్లోకి వస్తుంది. ఈ నెల 19వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు, మరోసారి తాజాగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
దళారులతో జాగ్రత్త..
రుణాలు ఇప్పిస్తామని కొందరు దళారులు లబ్ధిదారులను మోసం చేసే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో రుణాలు ఇప్పిస్తామని లబ్ధిదారుల నుంచి రూ.లక్షకు రూ.20 వేల చొప్పున వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులకు గాలం వేయడానికి దళారులు పావులు కదుపుతున్నారు. లబ్ధిదారులు దళారులను నమ్మకుండా నేరుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని గ్రామసభ, మున్సిపాలిటీల్లో ఎంపిక కావాల్సి ఉంటుంది. ఎంపికైన వారికే రుణాలు మంజూరవుతాయి.
కావాలసిన అర్హతలు..
గ్రామసభ ద్వారానే ఎంపిక చేయాలి..
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా యూనిట్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు గ్రామసభ, మున్సిపాలిటీ వార్డుల్లో సభల ద్వారా ఎంపిక కావాల్సి ఉంటుంది. ఆయా చోట్ల అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ సభల ద్వారా ఎంపికైన వారికే రుణాలు మం జూరవుతాయి. అలాగే వెబ్సైట్లో పొందుపరిచిన సెక్టార్, స్కీమ్లలోనే దరఖాస్తు చేసుకోవాలి.
లబ్ధిదారుల ఎంపిక పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉంటుంది. యూనిట్లు ఇప్పిస్తామని ఎవరైన డబ్బులు డిమాండ్ చేసినా, ఇబ్బందులకు గురిచేసినా నేరుగా మైనార్టీ కార్యాలయాన్ని సంప్రదించాలి. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. యూనిట్లు ఇప్పిస్తామని చెప్పే దళారులను నమ్మి మోసపోవద్దు.
-కృష్ణవేణి, మైనార్టీ జిల్లా సంక్షేమాధికారి, ఆదిలాబాద్