నిర్మల్ అర్బన్/సోన్, మార్చి 2 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్లో 80శాతం పేదవారే. సత్యసాయి ట్రస్టు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆయా స్కూళ్లలో చదువుతున్న పిల్లలకు శుక్రవారం నుంచి నిర్మల్ జిల్లాలో రాగి జావ అందించేందుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో రాగి పిండి, బెల్లంతో కలిపి తయారు చేసిన పౌష్టికాహార మిశ్రమాన్ని ప్యాకెట్లలో ఆయా ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతుండడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల చదువుపై ఆ ప్రభావం పడుతున్న నేపథ్యంలో పౌష్టికాహారం అందించాలన్న గొప్ప సంకల్పంతో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు స్వచ్ఛందంగా పాఠశాల విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడంపై ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మనం తీసుకున్న ఆహారాన్ని బట్టే ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. బలవర్ధకమైన ఆహారంతీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. అందుకే వైద్యులు సమాజంలో ప్రజలకు పౌష్టికాహారంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో పౌష్టికాహారం సరఫరాకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. అయితే స్వచ్ఛంద సంస్థ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని పోషకాహారం అందించేందుకు రాగిజావను పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేయడం విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాగి జావలో కాల్షియం, ప్రోటిన్లు, సూక్ష్మపోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, తదితర పోషక విలువలు ఉంటాయి. అవి విద్యార్థి ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణ, జ్ఞాపకశక్తికి ఇవి ప్రధానం. విద్యార్థులకు బలమైన పోషకాహారం అందనుంది. దీనిని నిర్మల్ జిల్లాలో 14 రోజుల పాటు నిర్వహించేందుకు ట్రస్టు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్లో స్నాక్స్, ఇతర ఆహార పదార్థాలను అందిస్తున్న నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థ అందరి రాగి జావను అందించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో రాగిజావ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో 51899 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఒక్కో విద్యార్థికి రోజుకు పది గ్రాముల చొప్పున 14 రోజుల పాటు ఈ రాగి జావను ట్రస్టు ఆధ్వర్యం లో పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం నిర్మల్, భైంసాలో ప్రత్యేకాధికారులను నియమించారు. భైంసాలో ఎమ్మార్సీలో అజయ్, నిర్మల్లో ఇద్దరిని ఇన్చార్జీలుగా నియమించి జావ ప్యాకెట్ల సరఫరాకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలో ఒకటి నుంచి పది వరకు చదువుతున్న విద్యార్థులకు రాగి జావను అందిస్తున్న నేపథ్యంలో 780 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 29711, 6నుంచి 8వ వరకు 14034, 9నుంచి 10వ తరగతి విద్యార్థులు 8154 మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. మొత్తం 51899 మంది విద్యార్థులకుగాను ఒక్కో విద్యార్థికి పది గ్రాముల చొప్పున 14 రోజుల పాటు అందించేందుకు 7266 కిలోల రాగి జావ అవసరముందని గుర్తించిన అధికారులు 242.2 ప్యాకెట్లను సరఫరా చేశారు.
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యం లో రాగి జావను శుక్రవారం నుంచి అందించేందుకు ట్రస్టు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రాగుల్లో వివిధ ఖనిజ పోషక విలువలు కలిగి ఉండటంతో అవి విద్యార్థుల ఎదుగుదలకు దోహదం చేస్తాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్రస్టు సౌజన్యంతో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు రాగి జావ అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
రవీందర్రెడ్డి, డీఈవో, నిర్మల్