కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/పెంచికల్పేట్, ఏప్రిల్ 4 : మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఓ ఏనుగు ప్రజలను వణికిస్తున్నది. 24 గంటల్లో ఇద్దరిని బలి తీసుకోగా, ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనన్న భయం వెంటాడుతుంది. బుధవారం మధ్యాహ్నం చింతలమానేపల్లి మండలం బూరెపల్లి సమీపంలో మిరపకాయలు ఏరుతున్న అల్లూరి శంకర్(55)ను తొండంతో కొట్టి చంపగా, గురువారం తెల్లవారు జామున పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన మరో రైతు కారు పోశన్న(65)ను తొక్కి అంతమొందించింది.
కొండపల్లికి చెందిన కారు పోశన్నకు గ్రామ శివారులో రెండెకరాల పొలం ఉంది. గురువారం ఉదయం 5 గంటలకు నీళ్లు పెట్టేందుకు బయలుదేరాడు. చెట్ల పొదల మాటునుంచి వచ్చిన ఏనుగు ఒక్కసారిగా అతడిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో మార్నింగ్ వాక్కు వెళ్లిన మాజీ సర్పంచ్ సుధాకర్ ఈ ఘటన చూసి కేకలు వేస్తూ గ్రామంలోకి పరిగెత్తాడు. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కుమారులు భీమేష్, అంజన్న, కూతురు సునీత ఉన్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ కరుణాకర్, సీఐ అల్లం రాంబాబు, ఎస్ఐ కొమురయ్య , ఇన్చార్జి ఎఫ్ఆర్వో సుధాకర్ బృందం అక్కడ విచారణ జరిపారు.
పోశన్న మృతదేహం వద్ద కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, అప్పటి దాకా మృతదేహాన్ని తరలించనివ్వబోమంటూ దాదాపు మూడు గంటల పాటు అక్కడే కూర్చున్నారు. అదనపు కలెక్టర్ వేణు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్స్గ్రేషియాను త్వరలో అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన రైతు కుటుంబ సభ్యులు కోరిన విధంగా బాధిత కుటుంబానికి సర్వేనంబర్ 119లోని ఐదు ఎకరాల భూమికి పట్టా అందిస్తామని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అదనపు కలెక్టర్ భరోసా ఇచ్చారు. రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని ఒప్పంద పత్రంలో ఆయనతో సంతకం చేయించుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆపై గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏనుగు సంచరిస్తున్న మండలాల పరిధిలో 144 సెక్షన్ విధించారు.
మహారాష్ట్ర నుంచి వచ్చిన ఏనుగు బుధవారం ఓ రైతును పొట్టనబెట్టుకున్న ఘటన మరవక ముందే మరో రైతును బలి తీసుకోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు ముందస్తు సమాచారమున్నా పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరు బలికావాల్సి వచ్చిందని, ఇప్పటి వరకు ఆ ఏనుగు ఎక్కడుందో తెలుసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని భయం భయంగా గడుపుతున్నామని, ఇకనైనా అధికారులు స్పందించి దానిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఏప్రిల్ 4 : జిల్లాలోకి వచ్చిన ఏనుగు ఇద్దరి మృతికి కారణమైంది. చింతలమానేపల్లి, పెంచికల్పెట్, దహెగాం, బెజ్జూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా పొలాల వైపు వెళ్లకూడదు. అటవీశాఖ అధికారులను సమన్వ యం చేసుకుంటూ ప్రత్యేక బృందాల ద్వారా ఏనుగు జాడ కోసం ప్రయత్నిస్తున్నాం.