యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పరిశ్రమలు స్థాపించాలని, ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదగాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్రాజ్, వరుణ్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ మండలం భుక్తాపూర్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని బీడీఎన్టీ ల్యాబ్స్ భవనం, నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో మంగళవారం పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నదని, టీఎస్-ఐపాస్, టీ-ఐడియా, టీ-ప్రైడ్ ద్వారా నిర్ణీత సమయంలో అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పారిశ్రామిక వేత్తలను సన్మానించి అభినందించారు.
– ఆదిలాబాద్ రూరల్/నిర్మల్ టౌన్, జూన్ 6
ఆదిలాబాద్ రూరల్/నిర్మల్ టౌన్, జూన్ 6 : యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పరిశ్రమలు స్థాపించాలని, ఆర్థికంగా అందనంత ఎత్తుకు ఎదగాలని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్రాజ్, వరుణ్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ మండలం భుక్తాపూర్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయం బీడీఎన్టీ హాల్లో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ఆదిలాబాద్ కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్వయం ఉపాధిపై పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ పద్మభూషణ్ రాజు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమలు స్థాపించి ఉపాధి పొందాలని సూచించారు. 9 ఏండ్లలో జిల్లా స్వయం ఉపాధి పారిశ్రామిక రంగంలో ప్రగతి సాధించిందని తెలిపారు.
జిల్లాలో పారిశ్రామిక విధానం, టీఎస్-ఐపాస్, టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల ద్వారా అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన, నిర్ణీత సమయంలో పారిశ్రామిక అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో టీఎస్-ఐపాస్ కింద రూ.97.63 కోట్లతో 271 యూనిట్ల స్థాపనకు అనుమతులు మంజూరుచేసి 1954 మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. వివిధ పరిశ్రమల స్థాపనకు టీఎస్-ఐడియా కింద 514 దరఖాస్తులకు రూ.65.85 కోట్ల రాయితీని మంజూరు చేసినట్లు వివరించారు. అంతకుముందు వివిధ పరిశ్రమల ఉత్పత్తుల ప్రదర్శనలను కలెక్టర్ పరిశీలించారు. పలువురు లబ్ధిదారులు.. రాయితీ వల్ల కలిగిన లాభాలు, విజయాల తీరును వివరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ చూపిన పలువురికి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఎల్డీఎం భాస్కర్ ప్రసాద్, విజయ డెయిరీ డీడీ మధుసూదన్, ఈడీఎం బండి రవి పాల్గొన్నారు.
నిర్మల్లో..
నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో పారిశ్రామిక ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి్మ మాట్లాడారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానంతోనే రాష్ట్రంలో పరిశ్రమలు పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. పారిశ్రామిక రంగంలో అద్భుత ఫలితాలు సాధించి ఉపాధి కల్పిస్తున్న పలువురిని జ్ఞాపికలు అందించి సన్మానించారు. 2014కు ముందు తెలంగాణ పారిశ్రామిక విధానం, 2014 తర్వాత పారిశ్రామిక విధానం, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై వారు అవగాహన కల్పించారు.
స్థానిక వనరులను దృష్ఠిలో పెట్టుకొని కొత్త పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతినివ్వడంతో జిల్లాలో రైస్మిల్లర్లు, దాల్మిల్లర్లు సోలార్ కరంట్, కుటీర పరిశ్రమలు, వ్యాపార పరిశ్రమలు పెద్ద ఎత్తున మంజూరయ్యాయన్నారు. దీంతో నిర్మల్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతీయువకులకు ఉపా ధి అవకాశాలు, వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం స్టాళ్లను సందర్శించి, మహిళలు తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. కొత్త పారిశ్రామికవేత్తలను సన్మానించారు. జడ్పీసీఈవో సుధీర్కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా భూగర్భ శాఖ అధికారి శ్రీనివాస్బాబు, డీఎస్డీవో రాజేశ్వర్గౌడ్, జిల్లా మైనింగ్ అధికారి క్రాంతికుమార్, ఈ మేనేజర్ నదీం పాల్గొన్నారు.
జిల్లాలో పరిశ్రమలు పెరిగాయి..
నిర్మల్ టౌన్, జూన్ 6 : తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిర్మల్ జిల్లాలో పరిశ్రమలు పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమల అనుమతి కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లు. ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించడం వల్ల 620 కొత్త పరిశ్రమలు ఏర్పడి, 2 వేల మందికి కొత్తగా ఉపాధి లభించింది. 9 ఏళ్లలో నిర్మల్ జిల్లాలో పారిశ్రామికంగా ఎదిగేందుకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది.
– నర్సింహారెడ్డి, జిల్లా అధికారి
సబ్సిడీతోనే ప్రోత్సాహం..
నిర్మల్ టౌన్, జూన్ 6 : తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాగింది. 2014కు ముందు నేను బోరుబండి వ్యాపారం చేసేవాణ్ని. తర్వాత కొత్త పారిశ్రామిక విధానం వల్ల ఎస్సీ, ఎస్టీ రైతులకు 80 శాతం సబ్సిడీపై పరిశ్రమలకు రుణాలు ఇచ్చారు. దీంతో టీఎస్-ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా. నాకు రూ.12 లక్షలతో కొత్త జేసీబీ మంజూరైంది. నా భార్య పేరిట కొత్త బైల్రైస్మిల్ రుణం అందింది. నా వద్ద 60 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
– తూర్పుర వెంకటేశ్, కల్లూరు
అనుమతులు సులభం..
నిర్మల్ టౌన్, జూన్ 6 : తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం కోసం అమలు చేసిన టీఎస్-ఐపాస్ ద్వారా అనుమతులు సులభతరం అయ్యాయి. ఆన్లైన్ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఉత్సాహులు ముందుకొస్తే ప్రభుత్వం వెంటనే సబ్సిడీ రుణాలను అందిస్తున్నది. నానే పట్టణంలోని సోఫీనగర్లో పైపు ఇండస్ట్రీ పెట్టుకున్న. ఇప్పుడు దాన్ని విస్తరించుకొని కార్మికులకు స్వయంగా ఉపాధి కల్పించేదుకు ప్రభుత్వమే కారణం.
– రాజమణి, శాంతినగర్, నిర్మల్
దివ్యాంగుడినైనా ధైర్యంగా..
నిర్మల్ టౌన్, జూన్ 6 : మాది మామడ మండలంలోని మారుమూల రాయదారి. నేను దివ్యాంగుడిని. ఏ పని చేద్దామన్నా వీలుకాకపోయేది. ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సాహించడంతో 2015లో మా ఊరిలోనే కొత్త రైస్మిల్ ఏర్పాటు చేసుకున్నా. రూ.20లక్షల రుణం ఇచ్చింది. ఇప్పుడు ధాన్యం బాగా వచ్చింది. మిల్లు విస్తరించి బియ్యం తయారు చేస్తున్నాం. రోజుకు 4 టన్నుల బియ్యం ఉత్పత్తే కాకుండా రోజుకు 50 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
– పీసర సురేశ్, రాయదారి