ఇంగ్లిష్.. ఇంగ్లిష్.. ఇంగ్లిష్.. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే క్రేజ్ ఏ రాష్ట్రమైనా.. ఏ దేశమైనా కామన్ భాష అదే.. మాతృభాషను గౌరవించినా..పోటీ ప్రపంచంలో ఆంగ్లం మస్ట్గూగుల్లో సమస్త సమాచారం కావాలన్నా..సోషల్ మీడియా అయినా ఆ లాంగ్వేజ్దే పైచేయి ఉన్నత చదువులైనా.. ఇంటర్వ్యూలు అయినా..ఉద్యోగాలైనా.. ఉపాధిలోనైనా ఇంగ్లిష్ లేకుంటే ఇక్కట్లే కానీ, నిన్నటిదాకా ఆంగ్ల విద్య ఉన్నోళ్లకు మాత్రమే అందేది.ఇకపై మాత్రం అందరికీ దరిచేరబోతున్నది.
నేటి పోటీ ప్రపంచంలో అందరి చూపూ ఆంగ్ల విద్యవైపు మళ్లుతున్నది. ప్రతి ఒక్కరిలోనూ తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలన్న కుతూహలం పెరుగుతున్నది. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమం అమలుతో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సర్కారు బళ్లు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉపాధ్యాయులు, గ్రామస్తులు తమంతట తామే ముందుకురాకపోతే.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వందలాది బళ్లు ఉనికి కోల్పోయేవని ఆయా జిల్లాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆంగ్ల విద్య ప్రవేశపెట్టిన తర్వాత ఒకే ఏడాది వేలాది విద్యార్థుల సంఖ్య పెరిగింది. అదే స్థాయిలో ప్రైవేట్ స్కూళ్లలో తగ్గింది. ప్రభుత్వం నిర్ణయించినట్లు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని రకాల సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి వస్తే భారీ ఎత్తున విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశమున్నది. ‘మన ఊరు- మన బడి’తో కొత్త జవసత్వాలు నింపుకోనుండగా, పేద, మధ్యతరగతి వర్గాల కల నెరవేరనున్నది.
నిజానికి ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమం అమలకు అనేక అడ్డంకులు న్నాయి. ఏ పాఠశాలలోనైనా సరే అమలు చేయాలంటే ముందుగా గ్రామ సభ తీర్మానం చేయాలి. తల్లిదండ్రులు అంగీకారం తెలుపాలి. ఆ తర్వాత ప్రాథమిక పాఠశాల వరకు అయితే జిల్లా విద్యాధికారి అనుమతి తీసుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలకైతే ఆర్జేడీ నుంచి పర్మిషన్ పొందాలి. ఉన్నత పాఠశాలల్లో అయితే విద్యాశాఖ కమిషనర్ నుంచి అనుమతి ఉత్తర్వులు తీసుకోవాలి. ఒక్కోసారి అనుమతి పొందడానికి అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. అంతేకాదు, కొంత మంది వ్యతిరేకించడం.. మరికొంత మంది ఉండాలని కోరడం వల్ల ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు సైతం అయోమయంలో పడే వారు. ఇక నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు మాతృభాషతోపాటు ఆంగ్ల విద్యను బోధించాల్సి ఉంటుంది. ప్రభుత్వమే అనుమతి ఇస్తుండడంతో ఇక ముందు ఎవరి నుంచీ అనుమతులు పొందాల్సిన అవసరముండదు.
కొత్త జవసత్వాలు..
ఈ నెల 17న క్యాబినెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో సర్కారు బడులు ఇక పూర్తిగా మారిపోనున్నాయి. ‘మన ఊరు.. మన బడి’తో కొత్త కాంతులు వెదజల్లనున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ఒకటి నుంచి పదో తరగతి వరకు అమలు చేయనుండగా, ప్రభుత్వ బడులకు కొత్త జవసత్వాలు రానున్నాయి. ఓవైపు మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే.. మరోవైపు ఆంగ్ల విద్యను అమలు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ఆంగ్ల విద్య అందుబాటులోకి వస్తుండడంతో మొదటి సంవత్సరంలోనే యాభైవేలకుపైగా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అంతా ఆంగ్లంవైపు..
నిజానికి ఉమ్మడి జిల్లా ప్రాథమిక విద్యారంగ ముఖ చిత్రాన్ని విశ్లేషిస్తే.. ఇప్పటికే యాభైశాతంకుపైగా ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల విద్యను అమలు చేస్తున్నాయి. కాకపోతే… కొన్ని ప్రాంతాల్లో ప్రాథమిక, మరొకొన్ని ప్రాంతాల్లో ప్రాథమికోన్నత, ఇంకొన్ని ప్రాంతాల్లో ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధిస్తున్నారు. దీని వల్ల విద్యార్థుల తర్ఫీదుకు సమయం ఎక్కవ పడుతున్నది. అయినా సరే ఆంగ్లం ప్రవేశపెట్టిన బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. సదరు పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థులు ఎవరూ కూడా తెలుగు మీడియం వెపు వెళ్లకపోడం ఆంగ్లవైపు బాటలు పడుతున్నాయనడానికి ఇది నిదర్శనం.
విద్యార్థుల సంఖ్య పెరిగింది
చెన్నూర్ రూరల్, జనవరి 25 : మా పాఠశాలలో ఐదో తరగతి వరకు ఉంది. ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాం. ప్రైవేట్ స్కూల్ వెళ్లే వారు మానేసి మా బడిలో చేరుతున్నారు. ఇప్పటి వరకు 30 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందిస్తున్నాం. మధ్యాహ్న భోజనం సైతం పెడుతున్నాం. ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే వేలాది రూపాయలు ఖర్చు అవుతాయి. అదే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే పైసా ఖర్చు లేకుండా చదువుకోవచ్చని గ్రామస్తులకు అవగాహన కల్పించాం. వారు సహకరించి పిల్లలను మా పాఠశాలలో చేర్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం బాగుంది. మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలకు వచ్చేందుకు ఉత్సాహం చూపుతారు. – శారద, హెచ్ఎం, నాగాపూర్ ప్రభుత్వ పాఠశాల
ప్రైవేట్ బడి మాన్పించిన..
చెన్నూర్ రూరల్,జనవరి 25 : నా పేరు దాద ఓదెలు.మాది చెన్నూర్ మండలం నాగాపూర్ గ్రామం. వీడియో గ్రాఫర్గా పనిచేస్తున్న. నాకు ఇద్దరు పిల్లలు. కొడుకు శ్రీహాన్ మూడో తరగతి, కూతురు ఆరాధ్య నాలుగో తరగతి చదువున్నారు. మొన్నటి వరకు ఒక ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలకు పంపించిన. ఇద్దరికి ఏడాదికి రూ. 35 వేల నుంచి రూ. 40 వేల ఖర్చు అయ్యేది. ఏటేటా ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారీ ఫీజులు కట్టేందుకు అప్పులు తేవాల్సి వచ్చేది. మా ఊరి సర్కారు బడిలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారు. దీంతో ప్రైవేట్ పాఠశాలకు మాన్పించిన. పిల్లలిద్దరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన. ఇప్పుడు ఫీజులకు రంది లేకుంటైంది. పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నరు. ఉచితంగా దుస్తులు, పాఠ్య పుస్తకాలు కూడా ఇస్తున్నరు. కడుపునిండా మంచి భోజనం పెడుతున్నరు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలకంటే ప్రభుత్వ బడులే మంచిగున్నయి. మా ఊరిలో 25 మంది పిల్లలు ప్రైవేట్ బడి మానేసి.. సర్కారు స్కూల్లో చేరారు. ఇగ ఇప్పుడైతే అన్నిచోట్లా ఇంగ్లిష్ మీడియం పెడుతరట. గిట్లయితే రాబోయే రోజుల్లో ప్రైవేట్ స్కూల్లు మూతపడడం ఖాయం