యేటేటా పెరుగుతున్న పెట్టుబడులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైతులను ఉద్యానవన పంటల వైపు మళ్లించేందుకు ఉద్యానవనశాఖ కృషి చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 1520 ఎకరాల్లో వివిధ పండ్ల తోటలు సాగవుతుండగా, ఈ ఏడాది మరో 80 ఎకరాలకు పైగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అరటి, బొప్పాయి, మామిడి, జామ, పనస, ఆయిల్ పామ్ వంటివి వేయనుండగా, ఆసక్తి ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, మిగతా రైతులకు 40 శాతానికి పైగా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ)
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో సమీకృత వ్యవసాయ విధానాలతో రైతులకు నిరంతర ఆదాయం అందించేందుకు ఉద్యానవనశాఖ చర్యలు పడుతోంది. యేటా మామిడి, అరటివంటి తోటలను విస్తరిస్తున్నారు. దీనికి తోడు ఈ యేడాది పసన, జామ, బొప్పాయి(పొప్పడి) పంటలు కూడా వేయించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో పన్నెండున్నర ఎకరాల్లో అరటి, రెండున్నరె కరాల్లో బొప్పాయి, పన్నెండున్నర ఎకరాల్లో మామిడి, 10 ఎకరాల్లో జామ, 25 ఎకరాల్లో పనస తోటలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న రైతులను ఎంపిక చేస్తున్నారు. ఇక సుమారు 20 ఎకరాల్లో ఇతర పండ్ల తోటలు పెంచనున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటికే 1520 ఎకరాల్లో మామిడి, ఆపిల్, ఆపిల్బేర్, అరటి, దానిమ్మ, పుచ్చ తదితర తోటలు వేశారు. వాణిజ్య పంటల వలన పెట్టుబడి భారం పెరుగుతుండడంతో ఉద్యానవనశాఖ పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తూ పండ్లతోటలను సాగుచేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో గతేడాది 122 ఎకరాలకు పైగా పండ్ల తోటలు సాగు చేసుకున్న రైతులకు రాయితీలను (ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ. లక్షకు 90 శాతం రాయితీ.. మిగతా రైతులకు 40 శాతానికి పైగా రాయితీ) ప్రోత్సాహకంగా అందించారు. వీటితో రైతులు పండ్లమొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం పండ్లతోటలను 80 ఎకరాలకు పైగా విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే 1466 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను విస్తరించేలా చర్యలు తీసకుంటున్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన, సిర్పూర్-టీ, దహెగాం, కెరమెరి, తిర్యాణి మండలాల్లో రైతులు ఎక్కువగా పండ్లతోటలవైపు ఆసక్తి చూపిస్తున్నారు. పండ్లతోటల పెంపకానికి ముందుకువచ్చే రైతులకు ఉద్యానవన శాఖ మూడేళ్ల వరకు రాయితీ అందించనున్నది. మామిడి సాగుచేసే రైతులకు ఎకరానికి రూ. 58,452, జామకు రూ. 76,112, సంత్ర సాగుకు రూ. 76,071, దానిమ్మ సాగుకు రూ. 91,474, బత్తాయి సాగుకు రూ. 69,547, సీతాఫలానికి రూ. లక్ష, సపోటకు రూ. 49,551, నేరేడుకు రూ. 31,719లను సంబంధిత శాఖ మూడేళ్ల వరకు రాయితీ అందిస్తుంది. సూక్ష్మసేద్య పథకం ద్వారా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీపై సేద్యపు పరికరాలను కూడా అందించేందుకు చర్యలు చేపట్టింది. మరోవైపు పండ్లతోటల పెంపకంతో పాటు అటవీ జాతి మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతుల కూడా రాయితీలు ఇస్తున్నది.