నిర్మల్ అర్బన్, జనవరి 22 : సీబీఎస్సీ తరహాలో వాసవి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని వాసవి పాఠశాల వార్షికోత్సవం స్థానిక సాగర్ కన్వెన్షన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల జ్యోతి ప్రజ్వలన చేసి, మాట్లాడారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అలాగే విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలన్నారు. ఉత్తమ విద్యకు నిలయంగా వాసవి పాఠశాల గుర్తింపును సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో టాప్ 100 పాఠశాలల సరసన నిలిచి ఎన్నో అవార్డులను అందుకోవడమే అందుకు నిదర్శనమని తెలిపారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా విదార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్ రాంరెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ పోతారెడ్డి, సెక్రటరీ జగదీశ్ రెడ్డి, ముత్యం రెడ్డి, నాయకులు కొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జనవరి 22 : 25 ఏండ్ల నుంచి ఒకే క్యాడర్లో భాషా పండితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పండిత పరిషత్ ఉపాధ్యాయులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి, సమస్యలను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర్ రావు, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, సభ్యులు రాజేశ్వర్, సంజు, సల్ల శ్రీనివాస్, శ్రీదేవి, హైమావతి, అనురాధ, కవిత, డీ శ్రీనివాస్, భూమన్న తదితరులున్నారు.