ఆదిలాబాద్/నిర్మల్, జనవరి 30(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’తో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొదటి విడుతలో 996 పాఠశాలలు ఎంపిక చేసి రూ.309.18 కోట్లు మంజూరు చేయగా, ఆయా స్కూళ్లలో సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ఆధునిక పనులు పూర్తి కాగా, రేపు పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు 42 బడులు ముస్తాబై సిద్ధంగా ఉన్నాయి. సమైక్య పాలకుల పట్టింపులేనితనంతో కళావిహీనంగా మారిన విద్యాలయాలు, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. మరోవైపు సర్కారు నిర్ణయంతో రూపాయి ఖర్చు లేకుండా ఆంగ్ల విద్య అందుతుండగా, నిరుపేదల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ మొదటి విడుతలో 248 పాఠశాలులు ఎంపికయ్యాయి. రూ.109.84 కోట్లు మంజూరు చేయగా, ఆధునిక పనులు కొనసాగుతున్నాయి. మండలానికి రెండు చొప్పున 36 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టుగా పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 23 పాఠశాలల్లో 100 శాతం పనులు పూర్తయ్యాయి. 16 పాఠశాలల్లో ప్లాంటేషన్ పనులు అయిపోగా, 22 బడులకు గ్రీన్చాక్ బోర్డులు వచ్చాయి. మరో 8 స్కూళ్లలో పెయింటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
పనుల పురోగతి ఇలా..
97 పాఠశాలల్లో కిచెన్షెడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 57 చోట్ల పూర్తయ్యాయి. టాయిలెట్లు 155 మంజూరు కాగా, 109 చోట్ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రహరీలు 135 మంజూరుకాగా, 100 చోట్ల పూర్తయ్యాయి. పాఠశాలలకు రంగులు వేయడం, తాగునీటి వసతి, ఎలక్ట్రికల్ వర్కులు, బోర్డుల ఏర్పాటు, ఫర్నిచర్, తరగతి గదులను రిపేర్ చేయించడంలాంటి పనులు దాదాపు ప్రతి బడిలోనూ జరుగుతున్నాయి. ప్రస్తుతం పనులు పూర్తయిన వాటిలో 10 పాఠశాలలను ఫిబ్రవరి ఒకటిన ప్రారంభించనున్నారు. నియోజకవర్గానికి మూడు చొప్పున మంచిర్యాలలో సబ్బేపల్లి, పద్తాన్పల్లి, గుళ్లకోట, చెన్నూరు నియోజకవర్గంలో ఎంపీపీఎస్ ఫిల్డర్బెడ్, దీపక్నగర్, పౌనూర్, బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఎంపీపీఎస్ ఇన్లైన్-2, గోపాల్నగర్, పల్లంగూడ సహా ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలంలోని పొనకల్ పాఠశాలలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్, జనవరి 30(నమస్తే తెలంగాణ) : జిల్లాలో 678 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 466 ప్రాథమిక, 105 ప్రాథమికోన్నత, 107 ఉన్నత పాఠశాలలు కలవు. ఇందులో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా మొదటి దశలో 141 ప్రాథమిక, 36 ప్రాథమికొన్నత, 60 ఉన్నత పాఠశాలలు కలిపి 237 బడులను అధికారులు ఎంపిక చేశారు. ఈ బడుల మరమ్మతు కోసం రూ.82 కోట్లతో అంచనాలు తయారు చేశారు. రూ.30 లక్షల లోపు అంచనా వేసిన 200 పాఠశాలల్లో 146 స్కూళ్లకు 10 శాతం అడ్వాన్స్ రూపంలో రూ.1.81 కోట్లు చెల్లించారు. పనులు జరుగుతున్న వాటికి రూ.9 కోట్ల వరకు బిల్లులు ఇచ్చారు. ఈ నిధులతో అవసరమైన సదుపాయాలు కల్పించడంతోపాటు అనేక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో..
జిల్లావ్యాప్తంగా 735 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మొదటి విడుత కింద 260 బడులను ‘మన ఊరు-మన బడి’ పథకం కింద అధికారులు ఎంపిక చేశారు. ఇందుకోసం రూ. 81.86 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా రూ.30 లక్షలపైగా చేపట్టాల్సిన పనులు 82 ఉండగా, రూ.30 లక్షల లోపు చేపట్టాల్సివని 178 ఉన్నాయి. ముందుగా రూ.30 లక్షల లోపు పనులు పూర్తి చేయాలనే ధ్యేయంతో పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.8.20 కోట్లు కేటాయించి, ఆయా ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) ఖాతాల్లో జమ చేసింది. ఈ నిధులతో 38 పాఠశాలల్లో పనులు పూర్తయ్యా యి. మరో 105 బడుల్లో 90 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మొదటి దశ కింద చేపట్టిన పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. జిల్లాలో ఫిబ్రవరి ఒకటిన 9 పాఠశాలలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మొత్తం 1,224 పాఠశాలలు ఉండగా, మన ఊరు-మన బడి కింద ప్రభుత్వం మొదటి విడుతలో 251 పాఠశాలలను ఎంపిక చేసింది. రూ.35.48 కోట్లు కేటాయించి పాఠశాలలను ఆధునీకరిస్తున్నది. డిజిటల్ తరగతులను అందుబాటులోకి తీసుకొస్తున్నది. అదనపు తరగతి గదులు, కిచెన్షెడ్లు ఏర్పాటు చేస్తున్నది. తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నది. ఆకట్టుకునేలా ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నది. సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. వర్ణమాలలు, జంతువులు, పక్షులు చిత్రాలు వేయిస్తుండగా, పాఠశాలలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ ఆంగ్ల బోధన అమలవుతుండగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఫిబ్రవరి ఒకటిన జిల్లాలో ఐదు పాఠశాలలను ప్రారంభించనుండగా, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నాడు : చిత్రంలో కనిపిస్తున్నది ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సుంకిడి పాఠశాల. ఇందులో 1-5వ తరగతి వరకు ఉండగా.. బాలికలు 23, బాలుర 32 మంది విద్యను అభ్యసిస్తున్నారు. రెండు తరగతి గదులు ఉండగా.. ఇద్దరు ఉపాధ్యాయులు బోధించేవారు. ప్రహరీ లేకపోవడంతో ఆవులు, గేదెలు, మేకలు ఆవరణలోకి వచ్చి మొక్కలను తినేవి. మంచి నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకునేవారు. వర్షాకాలంలో తరగతి గదుల్లోకి నీరు చేరడంతో కప్పలు, పాములు, కీటకాలు వచ్చేవి. విద్యార్థులు బెంబేలెత్తిపోయేవారు.
నాడు 25 మంది.. నేడు 55 మంది..
ఇది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని రిక్షా కాలనీలోగల ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల. మన ఊరు-మనబడి పథకం కింద ఎంపికైంది. రూ. 15.10 లక్షలతో సకల సౌకర్యాలు కల్పించారు. బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్స్, తాగు నీటి వసతి కల్పించడమేగాక కిచెన్ షెడ్ ఏర్పాటు చేశారు. పాఠశాల భవనాలకు రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు. గతంలో విద్యార్థుల సంఖ్య 25 మాత్రమే ఉండేది. ప్రస్తుతం వారి సంఖ్య 55కు పెరిగింది. ఆంగ్ల బోధన చేస్తుండగా, ప్రైవేట్ పాఠశాలల పిల్లలు ఇందులో వచ్చి చేరుతున్నారు. వచ్చే జూన్ నాటికి విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నదని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
నేడు : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సుంకిడి పాఠశాలను ‘మన ఊరు-మన బడి’ కింద ఎంపికైంది. మౌలిక సదుపాయాల కోసం సర్కారు రూ.6.62లక్షలు మంజూరు చేసింది. రూ.1,00,350తో తరగతి గదుల మరమ్మతు, రూ.39,262తో తాగునీరు, రూ.4,07,600తో ప్రహరీ నిర్మాణం, రూ.3.78 లక్షలతో మరమ్మతులు, రూ.43,595లతో విద్యుత్ సరఫరాకు వెచ్చించారు.
మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే..
మా ఇంటికి దగ్గరలోనే ప్రభుత్వ పాఠశాల ఉంది. మా ఇద్దరు పిల్లలను 1వ తరగతి నుంచి అక్కడే చదివిస్తున్న. పాప అర్చన, బాబు హర్షవర్ధన్ ఇద్దరు కూడా 4వ తరగతి చదువుతున్నరు. ఈ మధ్యనే బడిని మరమ్మతు చేసి, పిల్లలకు అన్ని వసతులు కల్పించారు. దీనికితోడు యూనిఫాంతోపాటు పుస్తకాలు కూడా ఉచితంగానే ఇచ్చారు. పిల్లలకు మంచి వాతావరణంలో సార్లు చదువులు చెబుతున్నరు. సీఎం కేసీఆర్ సారు ప్రభుత్వ స్కూళ్లను బాగు చేయడం వల్ల మా లాంటి వారికి ఫీజుల భారం తప్పింది.
– ఎల్.దివ్య, గృహిణి, మంజులాపూర్.
అన్ని వసతులు కల్పించారు..
నేను మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న. మా అన్నయ్య లోకేశ్ కూడా ప్రభుత్వ బడిలోనే చదివి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిండు. ఇక్కడి ఉపాధ్యాయులు అర్థమయ్యేటట్టు చెబుతున్నరు. రోజు సబ్జెక్టులవారీగా స్లిప్ టెస్టులు పెడుతున్నరు. ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించే ప్రత్యేక స్టడీ అవర్స్లో సబ్జెక్టులకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే వెంటనే నివృత్తి చేస్తున్నారు. పాఠశాలలో ఇటీవలే అన్ని సదుపాయాలు కల్పించారు. చాలా సంతోషంగా ఉంది. – టీ.శ్రీజ, విద్యార్థిని, రాంనగర్
అన్ని సౌలతులు చేసిండ్రు..
గతంల మా ఊరి పాఠశాలలో సరైన వసతులు లేక సానా ఇబ్బంది అయ్యేది. ఇరుకైన గదులుండేవి. పిల్లలు ఇరుక్కొని కూర్చొనేవారు. ఏ కాలమైనా సానా అవస్థలు పడేవారు. ఎండాకాలం ఉబ్బరపోత, వర్షాకాలం వర్షపునీటితో సమస్యలు ఎదుర్కొనేవారు. సీఎం కేసీఆర్ సారూ మా సొంటి బడులను బాగు చేయాలని తలిచారు. అందుకోసమే మా ఊరి బడిని బాగు చేయించారు. గిప్పుడు ఏ సమస్యా లేదు. పిల్లలు కూడా వసతులు ఉండడంతో మంచిగా సదువుకుంటున్నారు.
– రాథోడ్ సుదర్శన్, విద్యార్థి తండ్రి, సుంకిడి, సిరికొండ మండలం