మంచిర్యాల, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మంచిర్యాల జిల్లా కుర్మపల్లి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి ఎన్హెచ్-63 అలైన్మెంట్ మరోసారి మలుపు తిరిగింది. ఎన్హెచ్ఏఐ తాజాగా మూడో అలైన్మెంట్ తయారు చేయడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మొదట దండేపల్లి మండలం గూడెం నుంచి ముల్కల్ల వరకు పొలాల మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం సర్వే చేశారు.
దీంతో విలువైన వ్యవసాయ భూములు పోతున్నాయంటూ రైతులు ఆందోళన చేయడం, దాని బడ్జెట్ సైతం అధికమవుతుందనే ఉద్దేశంతో దాన్ని విరమించుకున్నారు. ఇక రెండోసారి ప్రస్తుతం ఉన్న హైవేను నాలుగులేన్లుగా విస్తరించడానికి సర్వే చేశారు. అలాగైతే ముల్కల నుంచి లక్షెట్టిపేట అవతలి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇండ్లన్నీ పోతాయని ఊర్లకు ఊర్లు నిరసనలు, ధర్నాలకు దిగాయి.
ఈ ప్రతిపాదన మార్చి, ముందున్న అలైన్మెంట్ ప్రకారమే చేయాలనే డిమాండ్ వచ్చింది. దీంతో తాజాగా అధికారులు మూడో అలైన్మెంట్ తయారు చేసి ఢిల్లీకి పంపించారు. ఇందుకు సంబంధించి సర్వే సైతం పూర్తి చేశారు. వారం, పది రోజుల్లో ఎన్హెచ్ఏఐ నోటిఫికేషన్ రాగానే టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ముల్కల నుంచి గూడెం వరకు పొలాలు, ఇండ్లు పోకుండా గోదావరి తీరం వెంట రోడ్డు వేసేలా మూడో అలైన్మెంట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నదీ తీరం నుంచి 500 మీటర్ల దూరంలో బైపాస్ వెళ్లేలా ఇది ఉంటుందని చెబుతున్నారు. ఇలా చేసినా కొన్ని వ్యవసాయ భూములు పోయే ప్రమాదం ఉంది. కానీ పెద్దగా ఇబ్బందులు లేకపోవచ్చని భావిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ముల్కల్ల నుంచి కుర్మపల్లి మధ్యలో పాత అలైన్మెంట్ను మార్చడంపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేస్తున్న సమయంలోనూ అధికారులను అడ్డుకొని ఆందోళనకు దిగినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు.
ముందు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న అలైన్మెంట్ను ఇప్పుడు మార్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారమైతే కొందరు బడా వ్యక్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కోల్పోతున్నారని వారికి మేలు చేసేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బడాబాబులకు మేలు చేసేందుకు సామాన్యుల భూముల నుంచి హైవేను తీసుకుపోతున్నారంటూ మండిపడుతున్నారు.
మొదటి అలైన్మెంట్ ప్రకారం ముల్కల్ల వాగు పక్క నుంచి రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. అలా చేస్తే కొందరు బడా వ్యక్తుల భూములు పోతున్నాయని, ఉద్దేశ పూర్వకంగానే ఈ అలైన్మెంట్లో దాన్ని మార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మొదటి అలైన్మెంట్ను అనుసరించే హైవే నిర్మించాలని రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఎన్హెచ్-63 నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఛత్తీస్గఢ్లోని జగ్దల్పూర్ వరకు విస్తరించి ఉంది. ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు 160 కిలోమీటర్ల మేర రూ.2500 కోట్ల అంచనా వ్యయంతో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం నాలుగేండ్ల క్రితమే అధికారులు సర్వే చేసి అలైన్మెంట్ రూపొందించారు. రైతుల ఆందోళనతో అది మారిగా, ఏడాది క్రితం తయారు చేసిన రెండో అలైన్మెంట్ వివిధ గ్రామాల ప్రజల నిరసనలతో మార్చాల్సి వచ్చింది. తాజాగా రూపొందించిన మూడో ఆలైన్మెంట్లో ముల్లల్క నుంచి కుర్మపల్లి వరకు వివాదాస్పదం కావడంతో స్థానికంగా వ్యతిరేకత మొదలైంది.
ఈసారి కూడా స్థానికులు అడ్డుకుంటే ఈ భారీ హైవే నిర్మాణం పూర్తి చేయడం సాధ్యమవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడో అలైన్మెంట్ తయారీ విషయమై ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ అజయ్ మణికుమార్ను వివరణ కోరగా… ఇండ్లు పోతున్నాయని స్థానికుల నిరసనలు, ప్రజా ప్రతినిధుల వినతులను పరిగణలోకి తీసుకొని మూడో అలైన్మెంట్ రూపొందించామన్నారు. హైవే ఎక్కడ వచ్చినా భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు. భూములు పోకుండా రోడ్డు వేయడం సాధ్యం కాదన్నారు. ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని హైవే నిర్మాణానికి పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు.