కొత్త వేరియంట్ ప్రచారం
నేపథ్యంలో సర్కారు ప్రత్యేక చర్యలు
మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో టీకాల ప్రక్రియ వేగవంతంపై నజర్
అర్హులందరికీ వ్యాక్సినేషన్ వేయాలని ఆరోగ్యశాఖకు కేబినెట్ ఆదేశం
ఆదిలాబాద్, నవంబరు 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ థర్డ్వేవ్ నేపథ్యంలో సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. సోమవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో ఒమిక్రాన్ పేరిట కొత్త వేరియంట్ వస్తుందనే వార్తల నేపథ్యంలో ముందస్తుగా అధికారులు కార్యాచరణ రూపొందించి అందించారు. జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని.. మంత్రులు వారి జిల్లాల్లో సమీక్షించాలని.. అవసరమైన వారందరికీ టీకా ఇప్పించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో టీకా ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా నియంత్రణలోనే ఉంది. రోజూ ఐదు నుంచి ఆరు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. కొవిడ్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నా యి. అనుమానితులకు టెస్టులు చేయడం, 18 ఏండ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం, వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు, వైద్యశాఖ అధికారులతో కొవిడ్ పరిస్థితిపై క్రమంగా సమావేశాలు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు. టీకా పంపిణీలో భాగంగా పంచాయతీలు, వార్డుల్లో వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైద్య, పంచాయతీ, డీఆర్డీవో, అంగన్వాడీ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ అర్హులకు టీకాలు ఇస్తున్నారు. దీంతోపాటు మొబైల్ వాహనాల ద్వారా గ్రామాల్లో పర్యటిస్తూ టీకా ఇస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 18 ఏళ్లు నిండి అర్హులైన వారు 5,48,098 మంది ఉన్నారు. జిల్లాలో 30 టీకా కేంద్రాలు ఏర్పాటు చేసి 5,20,250 మంది వ్యాక్సిన్ తీసుకోగా..ఇందులో మొదటి డోస్ తీసుకున్న వారు 4,03,892 మంది, రెండో డోస్ తీసుకున్న వారు 1,16,366 మంది ఉన్నారు. నిర్మల్ జిల్లాలో 28 టీకా కేంద్రాలు ఏర్పాటు చేసి 4,26, 267 మందికి ఫస్ట్ డోస్, 1,76,666 మందికి సెకండ్ డోస్ ఇచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్లో 3,05,279 మంది మొదటి డోస్, 59,748 మంది రెండో డోస్ తీసుకున్నారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలవారీగా ప్రత్యేక అధికారులను నియమించారు.
థర్డ్వేవ్ ప్రచారం నేపథ్యంలో చర్యలు
ఒమిక్రాన్ వేరియంట్ పేరిట వస్తున్న వార్తల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరిస్థితిని అధికారులు కేబినేట్కు వివరించారు. వైద్యశాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని అన్ని రకాల పరికరాలు, మానవ వనరులు, మందులు అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. మంత్రులు జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించాచి, అవసరమైన వారికి టీకాలు ఇప్పించాలన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మూడు జిల్లాలకు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు చాలా ఉన్నాయి. ఇరు రాష్టాలకు చెందిన ప్రజలు రైలు, బస్సు మార్గాల ద్వారా రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. ప్రభుత్వ సూచన మేరకు మూడు జిల్లాల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించనున్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చే వారిపై దృష్టి సారిస్తారు. జిల్లా మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి వ్యాక్సినేషన్తోపాటు కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించనున్నారు. కొత్త వేరియంట్ నేపథ్యంలో ప్రజలు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జాగ్రతలు తీసుకోవాలని, మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, అనవసర ప్రయాణాలు మానుకోవాలని కోరుతున్నారు. అర్హులైన వారందరూ టీకా తీసుకుని కొవిడ్ నుంచి రక్షణ పొందాలని సూచిస్తున్నారు.