ఆదిలాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ) : గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు.. పండుగలకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. అడవిబిడ్డల ఆచార వ్యవహారాలు భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నది. వీటికితోడు ఆలయాల నిర్మాణాలకు సహాయాన్ని కూడా అందిస్తున్నది. నాగోబా ఆలయ పునఃనిర్మాణానికి రూ.4.80 కోట్లతోపాటు రహదారులు, దర్బార్హాల్, ఇతర పనులకు నిధులు మంజూరు చేసింది. గిరిజన విద్యార్థులకు ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ద్వారా ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ కళాశాలల్లో కార్పొరేట్ విద్య అందిస్తున్నది.
దండారీ వేడుకలకు యేటా రూ. కోటి
యేటా దీపావళి పండుగ సందర్భంగా ఆదివాసులు దండారీ వేడుకలు వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా గుస్సాడీ నృత్యాలు, రేలారే రేలా పాటలు, యువతీయువకుల కోలాటాలు, డప్పుల మోత, గజ్జెల సవ్వడితో గూడేలు సందడిగా మారుతాయి. బంధుత్వాలను పెంచుకోవడానికి ఒక గూడెం నుంచి మరో గూడేనికి ఆదివాసులు వెళ్తారు. ఒక రోజు బస చేసి ఆనందంగా గడుపుతారు. దసరా తర్వాత ప్రారంభమయ్యే ఈ వేడుకలు దీపావళి అనంతరం కోలాబోడితో ముగుస్తాయి. ఈ వేడుకలకు ప్రభుత్వం మూడేళ్లుగా నిధులు విడుదల చేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గూడేనికి రూ.10 వేల చొప్పున కోటి రూపాయలు అందిస్తున్నది. ఈ డబ్బులను ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామ పటేళ్లు, దండారీ బృందాలకు అందజేస్తారు. సర్కారు నిధులు అందిస్తుండడంపై అడవిబిడ్డలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం సారు బాగుండాలని మొక్కుతున్నం
టీఆర్ఎస్ సర్కారు వచ్చినంకనే మా దండారీలకు శోభ వచ్చింది. గోండు,కొలాం ఆదివాసీలకు గీ దండారీలంటే పాణం. సీఎం కేసీఆర్ సారు మంచిగుండాలని మా గుస్సాడీ దేవర, భీమన్న, పెర్సపేన్లకు మొక్కుతున్నం. మా దండారీకి మొన్ననే రూ.10 వేల చెక్ ఇచ్చిన్రు. గీ పైసలతోని దండోరా వాయిద్యాలు తీసుకుంటం. యాడనో ఉండి మా పండుగు మేము చేసుకునేటిది. ఇప్పుడు సర్కారోళ్ల వల్ల అందరికీ తెలిసింది. అంతగా మా దేవరలని గౌరవిస్తున్న గీ సర్కారు సల్లంగుండాల.
– ఇంద్రు, పటేల్,భీంపూర్,భీంపూర్ మండలం
గుస్సాడీ వేషమేస్తే మస్తు సంబురమైతది
ఎంత చదుకున్నోళ్లయినా, సర్కారు జీతమున్నోళ్లు అయినా గీ పండుగొస్తే మా ఊరికి వస్తరు. గుస్సాడీ వేషమేస్తే నాకైతే మస్తు సంబురమనిపిస్తది. అదొక అదృష్టమనుకుంట. సీఎం కేసీఆర్ సారు మా ఆదివాసీలకోసం మస్తు చేస్తున్నరు. దండారీలకు నగదు ఇస్తున్నరు. అందుకే పండుగ మస్తు గొప్పగ చేసుకుంటున్నం. ఇగ గిరిజన రిజర్వేషన్, గిరిజనబంధు అసొంటివి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ సార్ మాకు దైవం అయ్యిండు. మేము ఎప్పటికీ సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతగా ఉంటం. – కుమ్ర జైవంత్, గుస్సాడీ వేషధారి, భీంపూర్
సీఎం కేసీఆర్కు వందనం
నిజం చెప్పాల్నంటే ఆదివాసీ పండుగు లకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది సీఎం కేసీఆర్ సారే. తెలంగాణ సర్కారు వచ్చినంకనే పల్లెపల్లెనా ఉండేటి దండారీలకు రూ.10 వేల చొప్పున ఇస్తున్నరు. గీ పైసలు మంచిగ పనికొస్తున్నయి. ఎడ్లాపురం జిల్లా దండారీలు ప్రపంచానికి తెలిసినయి అంటే దానికి కారణం టీఆర్ఎస్ సర్కారు. ఇది వరకు సీమాంధ్ర సర్కారోళ్లు దండారీలను పట్టించుకున్నది లేదు. నిన్ననే మా భీంపూర్ల 37 దండారీ బృందాలకు రూ.3.70 లక్షల చెక్కులు ఇచ్చిన్రు. సీఎం కేసీఆర్ సారుకు వందనాలు.
– మడావి లింబాజీ, సర్పంచ్ భీంపూర్, భీంపూర్ మండలం