ఆదిలాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావుకు వ్యతిరేకంగా ఆదివాసులు ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ కుమ్రం భీం చౌరస్తాలో భైఠాయించి, ఎంపీకీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో జరిగిన సమావేశంలో ఎంపీ సోయం బాపురావు ఆదివాసులను అవమానవర్చే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. పేద ఆదివాసులు పొట్టకూటికోసం ఇతర ప్రాంతాలకు వచ్చి నివాసం ఉంటే వారిపై సోయం బాపురావు అభాండాలు మోపడం బాధాకరమని ఆదివాసీ హక్కులు పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్, ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావులు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివాసులపై దాడులు జరుగుతున్న నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఐదు రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది ఆదివాసులు ఆయన ఇంటిని ముట్టడిస్తామన్నారు. ఆదివాసులపై మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నాలుక కొస్తామని ఆదివాసీ నాయకులు హెచ్చరించారు.
బీజేపీ నాయకుడిపై ఆదివాసీ మహిళల దాడి
బీజేపీ నాయకుడు, కొలాం సేవా సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావ్పై ఆదివాసీ మహిళలు దాడి చేశారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అనుచిత వ్యాఖ్యలు చేయగా.. ఆయన మాటలను సోనేరావు సమర్థిస్తున్నాడని ఆరోపిస్తూ దాడికి పాల్పడ్డారు. ఆదిలాబాద్ పట్టణంలోని కుమ్రం భీం చౌక్ వద్ద శనివారం ఆదివాసీ మహిళలు ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అక్కడే ఉన్న ఓ హోటల్కు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న సోనేరావు వీరితో ఎంపీ వ్యాఖ్యలను సమర్థిస్తూ గోండి భాషలో వాగ్వాదానికి దిగాడు. ఎంపీ కించపరిచేలా మాట్లాడుతుంటే.. నీవు మద్దతుగా ఎందుకు నిలుస్తున్నావని మహిళలు ఆయనను ప్రశ్నించారు. మాటామాటా పెరిగి ఆగ్రహానికి గురైన మహిళలు సోనేరావుపై దాడికి పాల్పడ్డారు. చొక్కా పట్టుకొని ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు లాక్కెళ్లారు. అనంతరం ఆదివాసీ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన సోనేరావ్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.