కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): సమైక్య రాష్ట్రంలో వెనుకబాటు, నిర్లక్ష్యానికి గురైన ఆదివాసీ పల్లెలు, స్వరాష్ట్రంలో కొత్త జీవం పోసుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర సర్కారు అందిస్తున్న నిధులతో ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలు జాతీయస్థాయిలో గుర్తింపు సాధిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నాయి. జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామం గతంలో కేంద్ర ప్రభుత్వం సంసద్కు ఎంపిక చేసిన గ్రామాల్లో జాతీయస్థాయిలో 35వ స్థానం పొందింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదర్శ గ్రామ పంచాయతీ పురస్కారానికి ఎంపికైంది.
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు
జిల్లాలో మార్లవాయి గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆదివాసుల స్థితిగతులపై గతంలో అధ్యయనం చేసేందుకు వచ్చిన హైమన్డార్ఫ్ దంపతులు ఈ గ్రామంలోనే విడిది చేశారు. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామానికి ఎంతో పేరు తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి (Palle pragathi) కార్యక్రమం ఈ గ్రామ రూపురేఖలనే మార్చింది. మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మార్లవాయి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా మారింది. గ్రామంలో అన్ని వీధుల్లో సీసీ రోడ్లు కనిపిస్తుంటాయి. రోడ్డుకిరువైపులా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతుంటాయి. ఇంటింటికీ స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందుతున్నది. గ్రామంలో ఏ వీధి చూసినా పరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంటుంది.
గ్రామ పంచాయతీ కార్యాలయం అందమైన పూల తోటతో ఆకట్టుకుంటుంది. గ్రామ అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా ట్రాక్టర్ అందుబాటులో ఉంది. గ్రామస్తులంతా కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. దీంతో పాటు పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పల్లె ప్రకృతి వనం, డంప్ యార్డు, శ్మశాన వాటిక పనులు వంద శాతం పూర్తయ్యాయి. డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ అంతరాయం ఇక్కడ లేనే లేవు. పంచాయతీకి ప్రతినెలా క్రమం తప్పకుండా వస్తున్న నిధులతో గ్రామం అసరాలు తీరుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పల్లెను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామం పక్కనే ఉన్న రాగాపూర్ చెరువును రూ. 3 కోట్లతో ప్రభుత్వం ట్యాంక్ బండ్గా మార్చడంతో గ్రామానికి మరింత శోభ వచ్చింది.
పల్లె ప్రగతితోనే మార్పు
పల్లె ప్రగతితోనే గ్రామాల్లో మార్పు వస్తున్నది. మా మార్లవాయి కూడా ఎంతో మారింది. ఇప్పుడు రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికవడం చాలా సంతోషంగా ఉంది. పారిశుధ్యం, పచ్చదనం గ్రామంలో వంద శాతం అమలు చేస్తున్నం. పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, డంప్ యార్డు అందుబాటులోకి వచ్చాయి. గ్రామస్తులు కూడా ఎంతో సహకరిస్తున్నారు.
-కనక ప్రతిభ, సర్పంచ్, మార్లవాయి