ఆదిలాబాద్ రూరల్, మే 8 : కేసుల దర్యాప్తులో పోలీస్ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలను అవగాహన కల్పించాలని చెప్పారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సోమవారం సందర్శించారు. ఆదిలాబాద్ రూరల్ సీఐ రఘుపతి, ఎస్ఐ జీ నాగనాథ్ పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు స్వాగతం పలికారు. సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం ఎస్పీ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు.
అనంతరం ప్రత్యేకంగా ఒక్కొక్కరితో మాట్లాడి పలు సూచనలు చేశారు. విచారణ పూర్తయిన కేసుల్లో తదుపరి ఉత్తర్వులను తీసుకొని వాహనాలను తిరిగి ఇచ్చేలా చూడాలని సూచించారు. ఠాణా పరిధిలో ఉన్న కేసుల ప్రస్తుత స్థితిగతులు, కోర్టులో పెండింగ్లో ఉన్న కేసు వివరాలను తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ప్రో యాక్టివ్ పోలీసింగ్కుప్రాధాన్యమివ్వాలని సూచిం చారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతీ గ్రామాన్ని సందర్శించాలన్నారు. సైబర్క్రైమ్పై అవగాహన కల్పించాలని చెప్పారు. సిబ్బంది మరింత కష్టపడి పనితీరును మెరుగుపర్చాలని సూచించారు. కార్యక్రమంలో సర్కిల్ ఎస్సైలు విష్ణువర్ధన్, జీ అప్పారావు పాల్గొన్నారు.