ఎదులాపురం, డిసెంబర్ 4 : ఈ నెల 8 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించే దేహదారుఢ్య పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ప్రారంభం కానున్న కానిస్టేబుల్, ఎస్ఐలకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షల ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. అంతకుముందు పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 10,374 అభ్యర్థులకు సంబంధించి శారీరక దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా 10, 12వ తేదీల్లో పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు డిజిటల్ మీటర్లు ఉపయెగిస్తున్నామని, పురుష అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగుకు, మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగుకు ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్) కార్డులను ఉపయోగించి అత్యాధునిక పరికరాలతో ఆటోమేటిగ్గా సమయం రికార్డు నమోదయ్యేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. షాట్ఫుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్లో క్వాలిఫై మేరకు మాత్రమే నమోదు చేయబడుతుందని, పరుగులో మాత్రం అభ్యర్థికి మార్కులను కేటాయించనున్నట్లు తెలిపారు.
ఈ వ్యవహారమంతా ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్ర పోలీస్ నియామక మండలి బోర్డు సర్వర్లోకి అప్లోడ్ అవుతుందన్నారు. పోలీస్ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతుందని, ఎవరైనా అక్రమ మార్గంలో మేలు చేస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని స్పష్టంచేశారు. ప్రతి బ్యాచ్ ఎంపిక ప్రక్రియ జరిగే సమయంలో ప్రతి అంశం సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని, తద్వారా దాన్ని భద్రపరుస్తామని తెలిపారు. భవిష్యత్లో ఏవైనా విమర్శలు వస్తే ఫుటేజీ ఆధారంగా విచారణ చేపడతారని స్పష్టంచేశారు.