ఆదిలాబాద్, ఏప్రిల్ 10 ( నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ సన్నద్ధతపై జిల్లా వైద్యాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో వైద్యాధికారులు సోమవారం మాక్డ్రిల్ నిర్వహించారు. గతంలో కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకొని మహమ్మారికి అడ్డుకట్ట వేసిన అధికారులు.. మరోసారి కరోనా ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ రిమ్స్తో పాటు ఉట్నూర్, బోథ్ కమ్యూనిటీ దవాఖానలు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నివారణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ర్యాపిడ్, పీపీఈ కిట్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. కొవిడ్ లక్షణాలున్న వారికి కరోనా కిట్లు పంపిణీ చేయనుండగా, వ్యాధి తీవ్రతను బట్టి మెరుగైన చికిత్స కోసం రిమ్స్కు తరలిస్తారు. జిల్లాలో అర్హులైన వారందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడంతో పాటు 12 సంవత్సరాలు నిండిన పిల్లలకు టీకాలు ఇచ్చారు.
ముందస్తు ఏర్పాట్లు..
కరోనా నివారణకు వైద్యశాఖ అధికారులు ముందుస్తు ఏర్పాట్లు చేశారు. లక్షణాలున్న వారికి ర్యాపిడ్తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ కేసులకు మందులు పంపిణీ చేయనున్నారు. రిమ్స్లో ఐసొలేషన్ వార్డుతో పాటు 500 ఆక్సిజన్ బెడ్లు, బోథ్, ఉట్నూర్ కమ్యూనిటీ దవాఖానల్లో పదేసి మంచాలను అందుబాటులో ఉంచుతారు. రిమ్స్లో ఆక్సిజన్ తయారీ కేంద్రం ఉండగా.. నిర్వహణ సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నివారణలో భాగంగా వైద్యశాఖ అధికారులు, సిబ్బంది గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధికారులు వైద్యులు, సిబ్బంది విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో కరోనా ప్రభావం లేనప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. రిమ్స్తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందికి సైతం ప్రత్యేక విధులు కేటాయించనున్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలి. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ లక్షణాలున్న వారు ప్రభుత్వ దవాఖానలకు పోయి పరీక్షలు చేయించుకోవాలి. పాటిజివ్ నిర్ధారణ అయిన వారికి ముందులు, చికిత్సలు అందజేస్తాం.
– నరేందర్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి, ఆదిలాబాద్