జైనథ్ ,ఆగస్టు 7 : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కంఠవాగులో సోమవారం వైద్య విద్యార్థి భూక్యా ప్రవీణ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ పురుషోత్తం వివరాల ప్రకారం..రిమ్స్లోని పీజీ మొదటి సంవత్సరం చదువుకుంటున్న పది మంది విద్యార్థులు ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ రూరల్ మండలం కుంభజరి కోటిలింగాల ఆలయం దర్శనానికి వెళ్లారు. అక్కడి వాగు లో సరదాగా స్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రవీణ్కుమార్ ఫొటోలు, వీడియో తీస్తున్నాడు. అప్పుడు ఫోన్ వాగులో పడిపోగా దానిని వెతుకుతూ లోపలికి వెళ్లి గల్లంతయ్యాడు. అతడిని కాపాడేందుకు మరో విద్యార్థిని ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. పోలీసులు రాత్రంతా గజ ఈతగాళ్లతో గాలించారు. అయితే సోమవారం ఉదయం మళ్ళీ వాగులో గాలించగా మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహానికి పంచనామా చేసి పోస్టుమార్టంకు తరలించారు.
ప్రవీణ్కుమార్ది రాజన్న సిరిసిల్ల జిల్లా …
దుర్మరణం పాలైన వైద్య విద్యార్థి ప్రవీణ్కుమార్ (27) స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి మండలం రంగంపేట గ్రామం. తల్లిదండ్రులు ఉస్మాన్ నాయక్, లక్ష్మి. వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కుమారుల్లో ఇతను రెండో సంతానం. ఎంతో భవిష్యత్ ఉన్న కుమారుడు ఇలా దుర్మరణం పాలుకావడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సంఘటనతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి .
అశ్రునివాళి
వాగులో గల్లంతై మృతి చెందిన ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థి భూక్యా ప్రవీణ్ కుమార్ మృతదేహాన్ని మెడికల్ కళాశాల ఎదుట ఉంచి నివాళులర్పించారు. వైద్యులు, వైద్య, నర్సింగ్ విద్యార్థులు, సిబ్బంది కడసారి చూసి కన్నీరుమున్నీరయ్యారు. తమ కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రి ఆరోపించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరుకున్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని జైనథ్ సీఐ కొల నరేశ్, ఎస్ఐ పురోషోత్తం తెలిపారు.
బాధిత కుటుంబానికి మంత్రి కేటీఆర్ ఫోన్
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన భూక్యా ఉస్మాన్ నాయక్ కుమారుడు ప్రవీణ్ కుమార్ వాగులో పడి మృతి చెందిన విషయాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని పవన్రావు ఫోన్ ద్వారా మంత్రి కేటీఆర్ను మాట్లాడించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా అందుకుంటామని భరోసా ఇచ్చారు.