ఆదిలాబాద్ రంజన్లకు భలే గిరాకీ ఉంది. నీటిని చల్లబరచడంలో ప్రత్యేకత కలిగినవి కావడం, ఆరోగ్యానికి మేలు చేస్తుండడంతో గిరాకీ బాగుంటుంది. వీటి తయారీని కుమ్మరులు ఆరు నెలల ముందు నుంచే ప్రారంభిస్తారు. వీటిపై ఆధారపడి జిల్లాలో వందల సంఖ్యలో జీవనం సాగిస్తున్నా యి. వీటి తయారీలో కుమ్మరుల కళ, నైపుణ్యం ఉట్టిపడుతున్నది. రంజన్లు విభిన్న రూపాల్లో, యంత్రాలకు దీటుగా తయారై ఆకట్టుకుంటున్నాయి. తయారీదారులు, అమ్మకందారులకు మాత్రం కాసులు కురిపిస్తున్నాయి. ఒక్కొక్క రంజన్ సైజులను బట్టి సుమారు రూ.100-రూ.200 వరకు ధర పలుకుతుండగా.. ప్రతి కుటుంబం దాదాపు రూ.50 వేలకుపైగా సంపాదిస్తున్నది. జిల్లావ్యాప్తంగా లక్షల రూపాయల బిజినెస్ అవుతున్నది.
– ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 9
ఆదిలాబాద్ జిల్లా రంజన్ల తయారీకి పెట్టింది పేరు. ఆదిలాబాద్, ఉట్నూర్, సిరికొండ, జన్నారం, బోథ్ మండలాల్లోని పలు గ్రామాల్లో కుమ్మరులు భారీ సంఖ్యలో తయారు చేస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వేసవికి ఆరు నెలల ముందు నుంచే తయారిని ప్రారంభిస్తారు. యేటా నవంబర్ నుంచే ముడిసరుకులు తెచ్చుకుంటారు. మన రంజన్లను మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, గోదావరిఖని, పెద్దపెల్లి, లక్షెట్టిపేట, జగిత్యాల, కాగజ్నగర్ పట్టణాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. అదీకాక మట్టిపొయ్యిలు, గళ్లగురిగీలు, కుండలు, పాత్రలు లాంటివి కూడా తయారు చేస్తారు. మొత్తానికి ప్రతి వేసవికాలంలో ఇటు తయారీదారులకు, అటు అమ్మకందారులకు జిల్లా రంజన్లు కాసులు కురిపిస్తాయి.
ఆదిలాబాద్ జిల్లాకు 120 కిలో మీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని యావత్మాల్ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కుమ్మరులు గుర్రపు లద్ది(పేడ) తీసుకొస్తారు. ఈ పేడ గడ్డిపోచల మాదిరిగా ఉంటుంది. కాగా.. లద్ది, నల్లమట్టి, ఎర్రమట్టి, బూడిదను కొనుగోలు చేస్తారు. రెండు గుల్లల లద్దిపై నీళ్లు చల్లి నానబెడుతారు. మూడు గంటలు నానిన తర్వాత పేడను చూర చేస్తారు. అలా చేస్తేనే అది మట్టిలో కలుస్తుంది. ఈ ప్రక్రియకు ముందే నాలుగు గుల్లల నల్ల, ఎర్ర మట్టి బెడ్డలను పగుల గొట్టి చూర చేస్తారు. ఆ తర్వాత నానబెడతారు. ఒక గుల్ల బూడిదను సిద్ధంగా ఉంచుతారు. ఈ మూడు సమపాలుగా ఉంటేనే మిశ్రమం సరిగా ఉంటుంది.
అడుగు తర్వాత రంజన్ తయారీలో గట్టు, కచ్చు వే స్తారు. ఇందులో కుమ్మరోళ్ల కళ ఆకట్టుకుంటుంది. చేతితోనే ఈ కళకు నైపుణ్యం అద్ది, యంత్రాలకు దీ టుగా తయారు చేస్తారు. రంజన్ అడుగుభాగం కం టే మధ్యభాగం వెడల్పు ఎక్కువగా ఉంటుంది. అడు గు పైన మిశ్రమాన్ని ఉంచి దాని బయట వైపు గుం డ్రంగా ఒత్తిపెడుతూ వరుస వరుసకు వెడల్పు పెం చుతూ పోతుంటారు. మధ్యభాగం తర్వాత.. పైఅంచుకు కింద వెడల్పు మళ్లీ తగ్గుతుంది. సల్ప, రౌతు సహాయంతో దీన్ని మొత్తుతూ రంజన్కు ఓ రూపా న్ని తెస్తారు. పైన అంచు కూడా ఇలాగే పూర్తి చేస్తారు. కుండల తయారీలో చక్రాన్ని ఉపయోగిస్తారు. కానీ.. రంజాన్ పూర్తిగా చేతిలోనే తయారవుతుంది.
రంజన్ల తయారీ ఒక ఎత్తయితే వాటిని ఎండబెట్టడం మరో ఎత్తు. ప్రతి కుటుంబం రోజూ 5-10 రంజన్లు తయారు చేస్తుంది. కుటుంబం మొత్తంగా ఇదే పనిపై ఉంటుంది. ఇలా పది రోజులకు 50-100 వరకు రంజన్లు తయారు చేస్తారు. ఏ రోజుకు ఆ రోజు త యారైన రంజన్లను వెంటనే ఎండలో పెడుతుంటా రు. ఆ సమయంలో వర్షం పడినా.. ఎండ సరిగా లేకపోయినా వారు నష్టపోయే ప్రమాదం ఉంది. అందు కే ఎండలు బాగా ఉన్న సమయంలోనే వీటిని తయా రు చేస్తుంటారు. అలా పది రోజులపాటు వాటిని ఎం డలో పెడతారు. తదుపరి వాటిని పరిశీలించి.. ఏమై నా పగుళ్లు ఏర్పడ్డాయా అని చూస్తారు. ఒక వేళ పగు ళ్లు ఏర్పడినట్లు కనిపిస్తే వాటిని మట్టితో మొత్తుతారు.
ఎండిన రంజన్లకు తర్వాత కింద భాగం వరకు ఎర్ర ని జాజు రంగు రుద్దుతారు. పై అంచుకు బింకం రం గు వేస్తారు. ఇందుకోసం వారు ప్రత్యేకంగా కూలీల ను పెడతారు. ఈ కూలీలు బట్ట సాయంతో రంగు అద్దుతారు. ఇందుకు ఒక్కో రంజన్కు ఐదు నిమిషా లు పడుతుంది. రంజన్ ప్రత్యేకతను చాటేలా ఎర్రని జాజురంగు కొట్టొచ్చేలా దాన్ని అందంగా అలంకరిస్తారు. పైన అంచుకు వేసే బింకం రంగు కూడా ప్రత్యేకమే. ఇది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో రాయి దొరుకుతుంది. దాన్ని పొడిలా మార్చి నానబెడుతారు. సాధారణంగా 10,30 లీటర్ల నీళ్లు పట్టే రంజన్లు ఇక్కడ తయారు చేస్తారు. ఎవరైనా ఆర్డర్ చేస్తే వారికి అనుగుణంగా కూడా తయారు చేస్తారు.
రంగులు పడ్డ తర్వాత రంజన్లను బట్టీ(ఆమం)లో కాలుస్తారు. బట్టీలో అడవిలో దొరికే చెక్కపొల్లును వినియోగిస్తారు. అది సరిపోకుంటే పాత టైర్లను వేసి రాత్రి కాల్చుతారు. అలా మూడు గంటలపాటు మం టల్లోనే ఉంచుతారు. సుమారు ఒక్కో బట్టీలో 100-120 వరకు రంజన్లు పెడుతారు. మధ్యమధ్యలో పగిలిన పెంకులను వినియోగిస్తారు. మంటతో వచ్చే పొగ రంజన్లను కాల్చిన తర్వాత బట్టి తొలగించగా.. కనీసం 10 నుంచి 20 శాతం వరకు పగులుతాయి.
అడుగుతో రంజన్ తయారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అడుగు వేసే ముందు మిశ్రమం భూమికి అంటుకోకుండా జల్లెడతో బూడిద గుండ్రంగా నేలపై పోస్తారు. దానిపై అడుగుకు సరిపడా మిశ్రమాన్ని ముద్దలు ముద్దలుగా పేడుతారు. ఒక చేతిలో కర్రతో తయారు చేసిన సల్ప, మరో చేతిలో రాయి పట్టుకుని అడుగును తయారు చేస్తారు.
మట్టితో తయారు చేసిన రంజన్ల నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వేడిని తగ్గించేందుకు ఈ మట్టి రంజన్లు ఉపయోగపడతాయి. రంజన్ల వాటర్ చాలా చల్లగా ఉంటుంది. ఎలక్ట్రికల్ ఫ్రిజ్ల కన్నా ప్రజలకు రంజన్లే చాలా మేలు చేస్తాయి. పైగా ఫ్రిజ్తో శరీరానికి వేడి, వేసవిలో ఫ్రిజ్లతో చాలా విద్యుత్ ఖర్చవుతుంది.
ఇంటిల్లి పాది కష్ట పడితే ఒకే సీజన్(ఆరు నెలలు) రూ.50 వేల వరకు సంపాదిస్తాం. ఒక్క రంజన్ 150 వరకు అమ్ముతాం. ఒక ట్రాక్టరు మట్టికి రూ.2,500, గుర్రపుపేడ కిలోకు రూ.20, బండెడు కట్టెలకు రూ.2,500 ఖర్చవుతాయి. మాకు భూమి లేదు. వర్షాకాలంలో కూలి పని చేసుకుంటూ ఎండాకాలంలో ఐదు నెలలపాటు ఇదే పని చేస్తాం. ఇంటిలో నలుగురం కష్టపడుతాం. మా కుటుంబానికి మంచి ఉపాధి అయితే లభిస్తుంది.
– కేలేటి సుభాష్, కుమ్మరితాండ.
మాది కులవృత్తి రంజన్లు, కుండలు ఇతర పరికరాలు తయారు చేయడం. యంత్ర పరికరాలు అందించి, రాయితీ రుణాలు అందిస్తే బాగుంటుంది. యంత్రాల ద్వారా మరింత ఎక్కువగా తయారు చేయడానికి వీలుంటుంది. చేతులతో తయారు చేయడం ద్వారా రోజుకు 10 వరకు తయారు చేయ గలుగుతాం.
– రూప, కుమ్మరితండా.