ఆదిలాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. సోమవారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ గ్యారంటీలకు బీఆర్ఎస్ కాపీ కొట్టిందని అనడం ఆయన ఆవివేకానికి నిదర్శమన్నారు. 60 ఏండ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభు త్వం ఎందుకు నేరవేర్చడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర బీజే పీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, మరో నాయకుడు లక్ష్మణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రె స్, బీజేపీలు రెండు ధోకేబాజ్ పార్టీలని విమర్శించారు.
మ్యానిఫెస్టోతో అన్ని వర్గాలకు ప్రయోజనం
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ.3 వేల గౌరవభృతి, రైతుబంధు పథకాన్ని ఐదేళ్లలో రూ.16 వేలు అందించనున్నట్లు, ఆసరా పింఛన్లు దశలవారీగా రూ.5,016కు పెరుగుతాయని పేర్కొన్నారు. దివ్యాంగులు పింఛన్లు ఇప్పటికే రూ.4016 కు పెరిగాయని వచ్చే ఏడాది రూ. 5 వేలకు పెరిగి క్రమంగా రూ. 6 వేలకు చేరుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచిందని, ఆ ధరను రూ.400కే సిలిండర్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు.
‘కేసీఆర్ బీమా-ప్రతి ఇంటికీ ధీమా’ పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం వర్తింపచేయనుందని, కేసీఆర్ ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ గరిష్ఠ పరిమితిని రూ.15 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు. రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం అందించనున్నట్లు, మహిళా గ్రూపులకు భవనాల నిర్మాణం, ఆగ్రవర్ణ పేదలకు ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ వంద సీట్లు సాధించడం ఖాయమని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల అజయ్, నాయకులు పాల్గొన్నారు.