ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 7: సీసీఐని పునరుద్ధరించే వరకు అఖిల పక్షంతో కలిసి ఉద్యమాలు కొనసాగిస్తామని అంతిమంగా సాధించి తీరుతామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రైతు, విద్యార్థి, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమం తర్వాత లక్ష పోస్టుకార్డుల ఉద్యమం చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్ విజ్జగిరి నారాయణ, సభ్యులు రమేశ్, బండి దత్తాత్రి, పోశెట్టి, శివ, ప్రశాంత్, బాలశంకర్ కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు యూనిస్ అక్బానీ, మెట్టు ప్రహ్లాద్, గడ్డం లస్మన్న, తదితరులు పాల్గొన్నారు.
అనాదిగా వస్తున్న వైద్యం యునాని
ఎదులాపురం, ఫిబ్రవరి 7 : అనాదిగా వస్తున్న పురాతన వైద్యం మన యునాని అని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ వర్షిణి, ప్రాంతీయ ఉపసంచాలకుడు రవినాయక్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్ఫా గార్డెన్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్చైర్మన్ జహీర్ రంజానీ, కోఆప్షన్ సభ్యుడు ఎజాజ్, శిబిరం నిర్వాహకురాలు ఫరీదాబేగం, నాయకులు మోబిన్, మోసిన్, అశోక్ రెడ్డి పాల్గొన్నారు.