మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 18 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కొత్త కమిటీ ఎన్నిక ఆదివారం జడ్పీ బాలుర పాఠశాలలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లా రెడ్డి, జిల్లా క్రీడా ప్రాదికారిక సంస్థ పరిశీలకులు రాజేశ్, ఎలక్షన్ అధికారి నిమ్మతి శ్రీనివాస్ సమక్షంలో నిర్వహించారు. చీఫ్ ప్యాట్రన్గా డాక్టర్ వేణుగోపాలాచారి, చైర్మన్గా పార్థసారథి, అధ్యక్షుడిగా గోవర్ధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా నారాయణ రెడ్డి, జనరల్ సెక్రటరీగా రఘునాథ రెడ్డి, ట్రెజరర్గా రమేశ్, ఉపాధ్యక్షులుగా రాంచందర్, శ్రీధర్ రెడ్డి, సాంబమూర్తి, చంద్రమోహన్ గౌడ్, శ్రీనివాస్, చంద్రయ్య, జాయింట్ సెక్రటరీలుగా సుధాకర్, ఫ్రాన్సిస్, రమేశ్, శేఖర్, పాండూ నాయక్, శ్రీనివాసరాజు, సభ్యులుగా శ్రీనివాస రెడ్డి, మారయ్య, శరత్ బాబు, శ్రీనివాస్ గౌడ్, దేవేందర్, హరిచరణ్, భూమన్న, ఈశ్వరాచారి, మహేందర్ సింగ్ ఎన్నికయ్యారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం గోప్యంగా నిర్వహించడంలో మతలబు ఏమిటో తెలియడం లేదు. గతంలో సెక్రటరీగా పని చేసిన రఘునాథ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల లిస్టు తదితరాలతో కూడిన వివరాలు మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడడం తిరిగి ఆయనే సెక్రెటరీగా ఎన్నికయ్యేందుకు చేసిన హడావిడా.. మరేవైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై రఘునాథ రెడ్డిని సంప్రదించగా వార్త రాస్తే రాయండి, లేదంటే వదిలేయండి.. అంటూ ఫోన్ కట్ చేశారు.
దీనిపై డీవైఎస్వో రజ్వీరును వివరణ కోరగా ‘మాకు కూడా హెడ్ ఆఫీసు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. వస్తే మాకు అబ్జర్వర్ డ్యూటీ వేస్తారు అని చెప్పారు. పాత డీవైఎస్ఓకు ఏమైనా సమాచారం వచ్చిందా అని అడిగితే, ఆయనకు కూడా తెలియదని చెప్పారు. వారి ఎన్నికలు వారు నిర్వహించుకున్నారు. అందులో అబ్జర్వర్ అంటూ నా పేరు కూడా ఫ్లెక్సీలో వేశారు. హెడ్ ఆఫీసు నుంచి మాత్రం ఎలాంటి సమాచారం రాలేదని సమాధానం ఇచ్చారు.