ఇంద్రవెల్లి, అక్టోబర్ 19 : ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో ఆదివాసీల ఆధ్వర్యంలో ఏత్మాసూర్ పేన్ దేవతకు భోగి ప్రత్యేక పూజలు నిర్వహించి గుస్సాడీ దండారీ ఉత్సవాలను బుధవారం వైభవంగా ప్రారంభించారు. మండలంలోని సమక, దోడంద, చిలాటిగూడ, చిత్తబట్ట గ్రామాల్లో ఏత్మాసూర్ పేన్ దేవతలు (అకాడపేన్ దేవతలు) ఉన్న వారి ఇంటి ఆవరణలో ఆదివాసీ గిరిజన సంప్రదాయ ప్రకారం గుస్సాడీలు ధరించే నెమలి ఈకలతో తయారు చేసిన టోపీలు, ఖోడాంగ్ దేవతలు, ఏత్మాసూర్ పేన్ దేవతలు, డోల్, పెప్రే, సన్నాయి, తుడుం, డప్పులు, పాయిలి, తబలాతో పాటు వివిధ వస్తువులు ఉంచి పురుషులు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుస్సాడీ (ఏత్మాసూర్) దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఉదయం నుంచి భోగి పూజలు చేసేవరకు ఉపవాసాలు పాటించారు. గుస్సాడీలుగా మారే యువకులు కలిసికట్టుగా ఒకే పల్లెంలో భోజనాలు చేశారు. ఈ గుస్సాడీ దండారీ ఉత్సవాలు దీపావళి పండుగ తర్వాత మూడు రోజుల అనంతరం కొలబడి ప్రత్యేక పూజలతో ముగింపు పలుకుతారు. దూర ప్రాంతాల నుంచి బంధువులు, అక్కా చెల్లెళ్లు గ్రామానికి తరలివచ్చి ఏత్మాసూర్ దేవతల భోగి ప్రత్యేక పూజల్లో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు పెందూర్ భగవంత్రావ్, మహారాజ్ కోరెంగ యశ్వంత్రావ్, భీంరావ్, నాగోరావ్, తుకారాం, ఆశోక్, లాల్షావ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రాదేవి ఆలయంలోపూజలు
మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో మండలంలోని గౌరాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని చిత్తబట గ్రామానికి చెందిన గుస్సాడీలతోపాటు బృందం సభ్యులు ఆదివాసీ గిరిజన సంప్రదాయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుస్సాడీలతోపాటు బృందం సభ్యులు, మహిళలు, పురుషులు వేర్వేరుగా ఆదివాసీ గిరిజన సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆడిపాడారు. ఆలయ ఆవరణలో సామూహిక వంటలు చేసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజనులు కనక తుకారాం, కోవ లాల్షావ్, అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పద్మల్పురి కాకో దేవస్థానానికి ఆదివాసీల పయనం
నార్నూర్, అక్టోబర్ 19 : దండేపల్లి మండలంలోని పద్మల్పురి కాకో దేవస్థానానికి మండలంలోని బెతల్గూడ గ్రామ ఆదివాసీలు, గుస్సాడీలు బయలుదేరారు. గ్రామంలో సాంస్కృతిక నృత్యాలు చేశారు. ఏత్మాసూర్ పేన్కు సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుర్సెంగ బొజ్జుపటేల్, కనక బాపురావ్, కుర్సెంగ అమృత్రావ్, పెందోర్ బిలాజీ, కుర్సెంగ నగేశ్, కోట్నాక్ జగ్గు, గ్రామస్తులు పాల్గొన్నారు.