సిరికొండ, డిసెంబర్ 21: ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) అమలులో ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం శభాష్ అనిపించుకుంది. ఈ 2021-22 ఆర్థిక సంవత్సరంలో తక్కువ సమయంలోనూ ఎక్కువ మంది కూలీలకు పని కల్పిస్తూ మార్కులు సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఉపాధి పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే.అప్పటి నుంచి పనులకు వచ్చే కూలీల సంఖ్య నిత్యం పెరుగుతూ వచ్చింది. ప్రారంభ సమయంలో కరోనా వల్ల ఉపాధి పనులకు ఆటంకం కలిగినా లక్ష్యాన్ని అధిగమించేందు కు జిల్లా యంత్రాంగం పట్టుదలతో శ్రమించింది. కూలీలకు పని కల్పించడంలో ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈజీఎస్ ప్రగతి నివేదికలు జిల్లాలు, మండలాల వారీగా ర్యాంకులను ప్రకటించింది. గతేడాది ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రం లో ఆరో స్థానంలో నిలవగా, ఈ సారి మరింత మందికిపని కల్పించి ర్యాంకును మెరుగుపర్చుకుంది.
468 పంచాయతీలు..
జిల్లాలో 18 మండలాల పరిధిలో 468 పంచాయతీలు ఉన్నాయి.1,72,878 జాబ్ కార్డులు ఉండగా వీటి పరిధిలో 3,57,416 మంది కూలీలు ఉన్నారు. వీరికి 2021-22ఆర్థిక సంవత్సరంలో 62.24 లక్షల రోజులు పని కల్పించాని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 46.64 లక్షల రోజులు పని కల్పించి 74.94 శాతం లక్ష్యాన్ని సాధించారు. 1,12,414 కుటుంబాలు ఉపాధి పనులు చేస్తుండగా కేవలం 10,180 కుటుంబాలు మాత్రమే వందరోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నాయి.అన్ని కాంపోనెంట్లు కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.123.40 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉపాధి పనుల కింది నర్సరీల్లో మొక్కల పెంపకం, మట్టి కట్టలు, ముళ్ల చెట్లు, పొదలు తొలగించడం, వ్యవసాయ పొలాల్లో రాళ్లు ఏరడం, వ్యవసాయ క్షేత్రాల్లో భూమిని చదువును చేయడం, మొక్కలు నాటడం, పరిరక్షించడం, సాగునీరు పారే కాల్వల్లో నిండిన మట్టిని తీయడం, పూడికతీత, భూగర్భ జలాలు పెంచే దిశగా పనులు చేపట్టారు.
జిల్లాలో ఫస్ట్.. స్టేట్లో సెకండ్
ఈ ఆర్థిక సంవత్సరంలో కూలీలకు ఉపాధి పని కల్పించడంలో సిరికొండ మండలం జిల్లా స్థాయిలో మొదటి స్థానం, రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మండలంలోని 11,994 మంది కూలీలకు 2,28,045 రోజులు పనికల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా 2,68,775 రోజు లు పనులు కల్పించి లక్ష్యాన్ని అధిగమించారు. ఈ మండలంలో 4,323 కుటుంబాలు ఉపాధి పనులకు వెళ్తుండగా 1,021 కుటుంబాలు వందరోజుల పని పూర్తి చేసుకున్నాయి. నార్నూర్ మం డలం జిల్లాలో రెండో స్థానంలో, రాష్ట్రంలో మూడో స్థానంలో నిలించింది. ఇంద్రవెల్లి మండ లం జిల్లాలో మూడో స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానాల్లో బజార్ హత్నూర్,ఆదిలాబాద్,బోథ్ నిలిచాయని జిల్లా ఉపాధి హామీ ఆధికారులు తెలిపారు.
వంద రోజులు పనికి వెళ్లాం
ఈజీఎస్ టీఏలు ఉపాధిహామీ పనులపై అవగాహన కల్పించడంతో మా కుటుంబ సభ్యులమంతా ఈ ఆర్థిక సంవత్సరంలో వందరోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లాం. మాకు మొత్తంగా రూ. 25 వేలు వచ్చాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ఉపాధి కూలీలకు ఆధికారులకు పని కల్పిస్తే ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లరు. ఇక్కడే పనులు చేసుకుంటారు.
కే రాధాబాయి, ఉపాధి హామీ కూలీ, సిరికొండ
అందరి సహకారంతోనే
ఉపాధి హామీ కూలీలు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో కూలీలకు వంద రోజులు పని కల్పించాం. సిరికొండ మండలం జిల్లా స్థానంలో మొదటి స్థానం సాధించి, రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. మండలంలో 4,323 కుటుంబాలు ఉపాధి పనులకు వెళ్తుండగా 1,021 కుటుంబాలు వందరోజులు పని పూర్తి చేసుకున్నారు.
-భీంరావ్, ఏపీవో, సిరికొండ