ఆదిలాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నల్లచట్టాలు తెచ్చి అన్నదాతలను అరిగోసకు గురిచేసిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ అదే ధోరణి అవలంబిస్తున్నది. ఇప్పటికే రైతులు నష్టపోతున్న తీరును గుర్తించి.. వచ్చే రబీకి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలంటూ పార్లమెంట్ సాక్షిగా రెండు సభల్లో తెలంగాణ ఎంపీలు గొంతెత్తి ప్రశ్నించినా.. కనీసం స్పందించిన పాపాన పోలేదు. మీరు చెప్పే మాటను బట్టి మేం యాసంగికి రైతులను సమాయత్తం చేసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర మంత్రులకు లేఖలు రాసినా.. ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ వైఖరి వల్ల అన్నదాత అయోమయంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రం మొండి వైఖరిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత్యంతరం లేక ప్రస్తుత యాసంగిలో రైతులు ఇతర పంటలు వేసుకోవాలని చెబుతున్నది. మళ్లీ వరి వేసి నష్టపోవద్దని విజ్ఞప్తిచేస్తోంది. అంతేకాదు.. ఇతర పంటలకు సంబంధించిన అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వ్యవసాయరంగానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. ఆ మేరకు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా పంటలకు సరిపడా సాగునీరు, 24 గంటల ఉచిత కరెంటు, రైతు బంధు, రైతుబీమా వంటివి అమలు చేస్తూ రైతన్నకు అండగా నిలుస్తుంది. దీంతో.. వరి పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా కొనుగోళ్లు చేసి.. వాటిని ఎగుమతి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉండగా, విస్మరించింది. ఎగుమతి చేసే సత్తా, సామర్థ్యాన్ని కూడా గట్టుకోలేక.. ఏకంగా తెలంగాణ నుంచి ధాన్యం కొనలేమంటూ చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయబోమని ప్రకటించి ఇబ్బందులకు గురి చేస్తుండగా, రాష్ట్ర సర్కారు మాత్రం అన్ని విధాలా అండగా నిలుస్తున్నదని రైతులు పేర్కొంటున్నారు.
నిర్మల్-ఆదిలాబాద్ జిల్లాల్లో..
రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, వ్యవసాయం లాభసాటిగా మారింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతులు పత్తి తర్వాత వరిని ఎక్కువగా సాగు చేస్తారు. వానకాలంలో నిర్మల్ జిల్లాలో 90 వేల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 2 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. రెండు జిల్లాల్లో కలిపి 1.30 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నది. రెండు జిల్లాల్లో 185 గ్రామాల్లో కాంటాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నది. 45 రోజుల క్రితం కొనుగోళ్లు ప్రారంభం కాగా, ప్రస్తుతం చివరిదశకు చేరుకున్నాయి.
1.07 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ
ఐకేపీ సంఘాలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల ద్వారా కాంటాలు పెట్టి మద్దతు ధరతో వడ్లు కొంటున్నారు. నిర్మల్ జిల్లాలో 182 కొనుగోలు కేంద్రాలు, ఉట్నూర్లో 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాలుకు ఏ గ్రేడ్ రకానికి మద్దతు ధర రూ.1960, బ్రీ గ్రేడ్కు రూ.1940 ప్రకటించింది. జిల్లాలో ఏ గ్రేడ్ ధాన్యం అమ్మకానికి వస్తుండడంతో రైతులకు మొదటి రకం వడ్ల ధర లభించనున్నది. రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు 1.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మిగిలిన ధాన్యం సేకరణ త్వరలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. వడ్ల కొనుగోళ్లను అధికారులు పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులను సైతం ప్రభుత్వం రైతులకు పంపిణీ చేస్తుంది. ఇప్పటి వరకు రూ.72 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
మంచిర్యాల జిల్లాలో..
జిల్లాలో 1,59,998 ఎకరాల్లో వరి సాగు చేశారు. లక్షా 75 వేల మెట్రిక్ టన్నులు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లా వ్యాప్తంగా 243 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో డీఆర్డీఏ (ఐకేపీ) 61, డీసీవో (పీఏసీఎస్) 120, డీసీఎంఎస్ ద్వారా 62 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 207 కేంద్రాల్లో కొనుగోళ్లు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 50,599.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రూ. 99.17 కోట్ల విలువైన వడ్లను 8,362 మంది రైతుల ద్వారా సేకరించినట్లు డీసీఎస్వో ప్రేమ్కుమార్ తెలిపారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
జిల్లాలో ఈ ఏడాది 51,623 ఎకరాల్లో వరి సాగు చేశారు. 40 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అం చనా వేశారు. మొత్తం 29 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశా రు. ధాన్యం సేకరణ లక్ష్యం 40 వేల మెట్రిక్ టన్నులు కా గా, ఇప్పటి వరకు 6500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన ట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం అన్ని చోట్ల ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
రైతుల ఖాతాల్లోకి రూ. 72కోట్లు..
నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను 80శాతం పూర్తి చేశాం. 182 కేంద్రాలను ఏర్పాటు చేసి లక్షా 13వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో రూ. 72 కోట్లు జమ చేశాం. ఈసారి ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపడుతున్నాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటే రైస్మిల్లులకు పంపుతున్నాం.
వడ్లు జెప్పన కొన్నరు..
ఈసారి వడ్లు జెప్పన కొన్నరు. ఇది వరకు వడ్లు అమ్మాలంటే 15 రోజులయ్యేది. ఇప్పుడు ధాన్యం తీసుకొచ్చిన ఐదు రోజుల్లోనే తేమ శాతాన్ని పరిశీలించి కొనుగోలు చేశారు. వెంటనే రైస్మిల్లుకు పంపించారు. బ్యాంకు ఖాతా, ఆధార్కార్డు జిరాక్స్ తీసుకొని డబ్బులను నా ఖాతాలో జమ చేశారు.