భైంసా/ భైంసా టౌన్, సెప్టెంబర్ 26 : భైంసా పట్టణంలో సోమవారం బతుకమ్మ కోలాహలం కనిపించింది. కిసాన్గల్లీ, కోర్వగల్లీ, భట్టిగల్లీ, రాజీవ్నగర్, ఏపీనగర్, గోపాల్నగర్, సుభాష్నగర్, రాంనగర్, కాలోనీల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేశారు. ప్రధాన వీధుల గుండా పాటలు పాడుతూ శోభాయాత్ర నిర్వహించారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో నిమజ్జనం చేశారు. మహిళలకు ప్రాజెక్టు వద్ద మున్నూరుకాపు మిత్రమండలి సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ప్రసాద వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కిరణ్ ఖారే, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, రామారావు పటేల్, మోహన్ రావు పటేల్, మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, కొట్టె హన్మండ్లు, పెద్ద కాపు గజ్జారాం, ముథోల్ మున్నూరుకాపు అధ్యక్షుడు మెంచు గంగయ్య, డాక్టర్ పోశెట్టి, మిత్ర మండలి పట్టణాధ్యక్షుడు పెండెపు కాశీనాథ్, కోర్వ చిన్నన్న రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. భైంసా మండల వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో పెట్టి ఆడిపాడారు. అనంతరం ఒకరినొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. గ్రామాల శివారులోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.