నిర్మల్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన మెడికల్ కాలేజీ పనుల పురోగతిలో మరో అడుగు ముందుకు పడింది. ఇటీవల 23 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ప్రస్తుతం 100 పడకల దవాఖాన, మరో 50 పడకల ప్రసూతీ దవాఖాన కొనసాగుతున్న క్రమంలోనే అదనంగా మరో 30 పడకలను మంజూరు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అందుకు జిల్లా దవాఖాన భవనంపై మరో అంతస్తులో గదులను నిర్మించనున్నది. అందుకు రూ.7 కోట్లు మంజూరుచేసింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, పట్టుబట్టి మరీ జిల్లాకు మెడికల్ కాలేజీని ప్రత్యేకంగా మంజూరు చేయించిన సంగతి తెలిసిందే. నిర్మాణానికి అన్ని అనుమతులతో కూడిన జీవో కూడా జారీ చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుండి తరగతులను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది.
అలాగే ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) అనుమతుల కోసం కసరత్తు సాగుతున్నది. మెడికల్ కాలేజీకి పూర్తి స్థాయిలో అనుమతులు రావాలంటే కనీసం 300 పడకలు అందుబాటులో ఉండాలి. అలాగే అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగానే సమకూర్చాల్సి ఉంటుంది. దానిని దృష్టిలోపెట్టుకొని భవిష్యత్లో అనుమతుల విషయమై ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ప్రణాళికలతోనే ఈ ఏర్పాట్లు సాగుతున్నాయి. కాగా, వైద్య ఆరోగ్య శాఖ ముందుగానే మెడికల్ కళాశాల కోసం 23 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను కేటాయించింది. వీరు ఇప్పటికే జిల్లా దవాఖానలో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు.
వచ్చే విద్యాసంవత్సరం నాటికి మెడికల్ కాలేజీని అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. కాలేజీ భవన నిర్మాణం కోసం ఇప్పటికే అధికారులు నిర్మల్ శివారులోని భీమన్న గుట్ట ప్రాంతంలో 25 ఎకరాల స్థలాన్ని గుర్తించి, వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించారు. ఇక్కడ ప్రస్థుతం రూ.40కోట్ల నిధులతో 250 పడకల దవాఖాన నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. ఇటీవలే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో 50, జిల్లా దవాఖానలో 100 పడకల ద్వారా ఇక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయి. తాజాగా మరో 30 పడకల కోసం రూ.7కోట్లు మంజూరయ్యాయి.
మొత్తంగా 430 పడకలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, మెడికల్ కాలేజీని జి ల్లాకు మంజూరు చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన వి షయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కాలేజీ ప్రారంభం కానున్నది. ముం దుగా 100 సీట్లకు ప్రవేశాలను చేపట్టనున్నారు. అలాగే మెడిక ల్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. ప్రభు త్వం నూతన భవనాల నిర్మాణాలు, ఇతర సదుపాయాల కోసం రూ.166కోట్లు విడుదల చేసింది. మొత్తంగా రూ.213 కోట్లు విడుదల కాగా, పనులను పూర్తి చేసి ఏడాదిలోగా మెడికల్ కాలేజీని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతున్నది.
మెడికల్కాలేజీ ఏర్పాటుతో జిల్లావాసులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం ప్రజలు నిజామాబాద్, హైదరాబాద్ పరుగులు పెట్టాల్సి వస్తున్నది. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం.. ఆరోగ్యపరంగానే కాకుండా, ఆర్థికపరంగా కూడా సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు పనులు ప్రారంభమవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.